మాజీ కేంద్రమంత్రి, ఆంధ్రా షుగర్స్ ఎండీ బోళ్ల బుల్లి రామయ్య కన్నుమూత
పశ్చిమగోదావరి: కేంద్ర మాజీమంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్ ఎండీ బోళ్ల బుల్లిరామయ్య(91) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ఉదయం మృతి చెందారు.
1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన బుల్లిరామయ్య.. 1984, 1991, 1996, 1999లో ఏలూరు నుంచి ఎంపీగా పనిచేశారు. 1996-98 మధ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా కూడా ఆయన పనిచేశారు.
బుల్లిరామయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు బుల్లిరామయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
టిడిపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలు ఎనలేనివి.
— N Chandrababu Naidu (@ncbn) February 14, 2018
బుల్లిరామయ్య కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, కెఎస్ జవహర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం పెదపట్నం అగ్రహారంలో బోళ్ల బుల్లిరామయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.