చంద్రబాబు దావోస్ ఖర్చు..వైఎస్ జగన్ ప్రభుత్వం నెత్తిన!
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారో లెక్కే లేదు. ఓ దేశ ప్రధాని కంటే ఎక్కువగా ఆయన ప్రపంచ దేశాల్లో పర్యటించారు. జపాన్, సింగపూర్, చైనా, శ్రీలంక, తజకిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణ కొరియా, అమెరికా.. ఇలా ఏటా కనీసం రెండు విదేశీ పర్యటనలను చేసొచ్చే వారు. వాటన్నింటి కంటే చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన టూర్.. దావోస్. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కావడం చంద్రబాబు అత్యంత ఇష్టమని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. దీన్ని నిజం చేసేలా ఆయన ప్రవర్తించారు. క్రమం తప్పకుండా దావోస్ వెళ్లొచ్చారు.
మా బాలా మావయ్య చాలా మంచోడు: తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగింది మీరే! లోకేష్
పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ప్రపంచ దేశాల పర్యటన..
దీనికి చంద్రబాబు పెట్టిన పేరు- పెట్టుబడుల ఆకర్షణ. దావోస్కు వెళ్లడం వల్ల చంద్రబాబు మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో తెలిసిన విషయమే. విదేశీ పర్యటనల ఖర్చు మేర పెట్టుబడులు కూడా రాలేదంటూ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా తనను ప్రపంచదేశాల అధినేతలు, పారిశ్రామికవేత్తలు తనను గుర్తించారని, వారి ఆహ్వానం మేరకే తాను వెళ్తున్నాననేది ఆయన తరచూ చెప్పే మాట. చంద్రబాబు హయాంలో ఆయన చేసిన పర్యటనల ఖర్చు అంతా రాష్ట్ర ఖజానా మీదే పడిందనే విషయం తాజాగా రుజువైంది. ఈ ఏడాది చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లలేదు. ఆయన తరఫున కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ పర్యటనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా- ఏపీ ప్రతినిధుల బృందం దావోస్లో 14 కోట్ల రూపాయల మేర వ్యయం చేశారట. దీనికి సంబందించిన బిల్లు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సీఐఐ పంపించిన బిల్లు అది..
భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) మనదేశం తరఫున దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్స్కు అయ్యే అద్దె ఖర్చును ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది. నారా లోకేష్ నేతృత్వంలో అధికారులు, మంత్రుల బృందం ఒకటి ఈ సదస్సుకు హాజరైంది. సీఐఐ ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లల్లో కొన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్లిన బృందం అద్దెకు తీసుకుంది. 2019లో ఏపీ బృందం దావోస్లో తీసుకున్న లాంజ్ అద్దె ఖర్చు 2 కోట్ల 48 లక్షలుగా తేలింది. ఇందులో కంప్యూటర్లు అమర్చడానికి, అహూతుల కోసం సోపాలు ఏర్పాటు చేయడానికి మరో 2 కోట్ల 51 లక్షల రూపాయల బిల్లును వేసింది సీఐఐ.
భోజనాల ఖర్చే రూ.కోటి దాటిందట..
ఏపీ ప్రతినిధుల బృందం నాలుగు రోజుల భోజనాల ఖర్చు కింద 1,05,00,000 లక్షల రూపాయలను వేశారు. ఈ స్టాల్లో ఒక ఎల్ఈడీ స్క్రీన్ ను అమర్చడానికి కూడా కోటి 45 లక్షల బిల్లు వేశారు సీఐఐ ప్రతినిధులు. ఇలా రకరకాల ఖర్చుల కింద మొత్తం బిల్లు 14 కోట్ల 41 లక్షలుగా ఉంది. ఇప్పుడీ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ సీఐఐ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖకు బిల్లును జత చేసింది. దేనికెంత ఖర్చయిందో వివరిస్తూ ఓ బ్రేకప్ ఇచ్చింది. ఇప్పుడీ బిల్లును చెల్లించాల్సిన బాధ్యత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉంది. ఈ మొత్తాన్ని ఖచ్చితంగా చెల్లించి తీరాల్సిన పరిస్థితిని వైఎస్ జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ఈ ఖర్చు వ్యవహారం పట్ల వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టే అవకాశాలు లేకపోలేదు.