తాళపత్ర గ్రంథాల్లో అమూల్య నిధి, స్వామివారి నిధి కోసమేనా?: అన్నీ వివరించిన రమణదీక్షితులు
అమరావతి: తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు బుధవారం హైదరాబాదులోని సోమాజిగూడ మాట్లాడారు. ఈ సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులు, పురాతన తాళపత్ర గ్రంథాల్లో శ్రీవారి అమూల్య నిధుల వివరాల గురించి ఆయన వివరించారు. కలియుగంలో పోనుపోను మనుషుల్లో తీవ్రమైన దురాశ కలుగుతోందన్నారు. భక్తి, భయం లేదన్నారు.
షాకింగ్... రామ్మాధవ్ చేతికి కీలకపత్రాలు: బుగ్గనకు టీడీపీ ఝలక్, స్పీకర్కు ఫిర్యాదు
తిరుమల రాయల వారు సుమారు 1000 ఏనుగులు, 30వేల అశ్వాలపై అమూల్యమైన సంపదను, వారికి యుద్ధ విజయాల్లో ప్రాప్తించిన సంపదను తిరుమలకు తీసుకు వచ్చి ఎక్కడో నిక్షిప్తం చేశారన్నారు. ఆ సంపదను అంతటిని కీలకమైన ప్రదేశాల్లో సామాన్య మానవుల యొక్క మేథస్సుకు అందరాని విధంగా నిక్షిప్తం చేశారని చెక్కబడి ఉందన్నారు.
అప్పుడు సవాల్ జవాబ్ పట్టీ తయారు చేశారు
1,800 సంవత్సరం సమయంలో ఆర్కాట్ కలెక్టరుగా ఉన్న ఓ ఆంగ్లేయుడు తిరుమలకు వచ్చి తిరుమల దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలను సవివరంగా సమీక్షించారని రమణదీక్షితులు చెప్పారు. అర్చకులు, పరిచారకులు అదే విధంగా స్వామివారి దేవాలయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అనేక వృత్తులవారిని పిలిపించి, వారి కర్తవ్యాలు, వారు చేసే సేవలు, అందుకు ఫలితంగా వారికి లభించే వరుంబడి, వీటన్నింటిని ప్రశ్నోత్తరాలుగా క్రోఢీకరించి, సవాల్ జవాబ్ పట్టీ అనే దానిని తయారు చేశారని చెప్పారు.
వెయ్యి కోట్ల దేవుడు అని పిలిచేవారు
వెంకటేశ్వర స్వామివారిని 1000 కోట్ల దేవుడని పిలిచేవారని, కాకతీయరాజు ప్రతాపరుద్రుడు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు 18 లక్షల బంగారు మొహరీలు ఉపయోగించి మూలవరులకు అంటే సుమారు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన మూలవరులకు నవరత్న కవచం.. రత్నాంగిణి అనే పేరుతో సమర్పించారని, తర్వాతే అదే సందర్భంలో 18 లక్షల బంగారు మొహర్లు.. ఒకటి సుమారు 100 గ్రాములు ఉంటుందన్నారు. వాటితో స్వామి వారికి కనకాభిషేకం చేయించి, ఇంకా ఎన్నో అమూల్యమైన నవరత్నాలను, బంగారు విగ్రహాలను, స్వామి వారి దేవాలయం మొదటి ప్రాకారంలో నేలమాళిగలో ఉంచారని రమణదీక్షితులు చెప్పారు.
నేలమాళిగ కొలతలు కూడా చెప్పారు
ఆ నేలమాళిగ కొలతలు కూడా చెప్పారని రమణదీక్షితులు అన్నారు. ఆ నేలమాళిగలో భద్రపరిచి, పైన తలుపులు వేసి మూసిన తర్వాత, దానిపై బండలు పరిచారని, అది సామాన్య భక్తులు ప్రవేశించలేని విధంగా ఉంటుందని పత్రాల్లో చెప్పబడిందన్నారు. అంతకుముందు పల్లవులు, చోళులు వంటి ఎందరో చక్రవర్తులు, వారి సామంతరాజులు ఇచ్చిన అమూల్యమైన ఆభరణాలను కూడా మొదటి ప్రాకారంలో దాచారని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయన్నారు.
అక్కడకు అర్చకులు, వంటవారు మినహా ఎవరూ వెళ్లరు
తొలి ప్రాకారంలో భక్తులు వెళ్లలేని ప్రదేశాలు రెండున్నాయని, వాటిలో ఒకటి స్వామి వారి గర్భాలయం, రెండోది యాగశాల అన్నారు. నిత్యం ఉదయం తర్వాత దాన్ని మూసివేస్తారని ఆయన తెలిపారు. దాని పక్కనే దక్షిణ ఆగ్నేయంలో కట్టబడిన స్వామివారి వంటశాల ఉందని, దీనిలోకి వంటవారు, అర్చకులు మినహా మరెవరూ వెళ్లేందుకు వీల్లేదన్నారు. ఎటునుంచి చూసినా, ఇతరులకు ప్రవేశం లేని వంటశాలలోనే నేలమాళిగలకు దారి ఉందన్న విషయం తేటతెల్లమవుతుందన్నారు.
మాకు తెలియకుండా ఎలా మూసేశారు?
2017 డిసెంబర్ 8న స్వామివారి లోపలి పోటును మూసేశారని, ఆ విషయం తనకు తెలిసి విచారించానని రమణదీక్షితులు చెప్పారు. లోపల నాలుగు రాతి బండలు పగిలాయని, కొద్ది రోజులు పోటు మూసివేశామని జేఈఓ శ్రీనివాసరాజు చెప్పినట్టు పేపర్లలో వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. స్వామి ప్రధానార్చకుడిగా, వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారుగా ఉన్న తనకు, మరో ముగ్గురు ప్రధానార్చకులకు తెలియకుండానే పోటులో మూసివేయడం ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ సమయంలో అన్న ప్రసాదాలు ఎక్కడ తయారు చేశారో తనకు తెలియదన్నారు. ఎవరి సలహా తీసుకుని ఈ పని చేశారో తెలియదన్నారు. స్వామి నిధుల కోసమే తవ్వకాలు జరిపారన్న తన ఆరోపణలపై సమాధానం చెప్పాలన్నారు. తప్పులను ఎత్తి చూపితే తనపై కక్ష సాధిస్తున్నారన్నారు.