గడప వద్ద పింఛన్ల పంపిణీ అవసరమా?: జగన్ సర్కార్కు మాజీ సీఎస్ సూటి ప్రశ్న.. !
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు తప్పు పట్టారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న మీ పింఛను.. మీ గడప వద్దకే.. పథకాన్ని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు సంధించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పింఛన్ మొత్తాన్ని వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేస్తోంది. గ్రామ, వార్డు వలంటీర్లు ప్రతినెలా ఒకటవ తేదీన తెల్లవారు జామునే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
కిందటి నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ పథకంపై ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పింఛన్ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లకే జమ చేయవచ్చని అన్నారు. ఒక్క క్లిక్తో పింఛన్ మొత్తం ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా లబ్దిదారుల అకౌంట్కు జమ అవుతుందని చెప్పారు. ఇలాంటి సాంకేతికత అభివృద్ధి చెందిన సమయంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయాల్సిన అవసరం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ నిధులను తాము సొంతంగా లబ్దిదారులకు అందజేస్తున్నామనే భావన ప్రజలకు కల్పించడానికే జగన్ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. పేటీఎం లాంటి సౌకర్యాలు గ్రామాలలో కూడా అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ఐవైఆర్ కృష్ణారావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు తమ సొంత నిధులను ప్రజలకు అందజేస్తున్నారనే భావనను కల్పించడానికి తప్ప ఈ పథకం వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండబోవని అన్నారు.
వృద్ధులకు నేరుగా పింఛన్ మొత్తాన్ని చేరవేయడం ఒకరకంగా మంచిదేనని చెప్పుకొచ్చారు. ఐవైఆర్ కృష్ణారావు చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చే సాగింది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇంటివద్దకే పింఛన్లను పంపిణీ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో వృద్ధులు, అనారోగ్య పీడితులకు ఉపయోగకరంగా ఉంటోందని అన్నారు. అలాంటి వారికి పింఛన్ మొత్తాన్ని తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన ఇబ్బంది నుంచి తప్పించినట్టయిందని చెప్పారు.