అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కూన రవి కుమార్ అజ్ఞాతం వీడారు. గత మూడు రోజులుగా కన్పించకుండాపోయిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కూన రవికుమార్ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రభుత్వ అధికారులను బెదిరించిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . ఇక పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో పోలీసుల ముందు హాజరయ్యారు కూన రవి కుమార్ .
తహసీల్దార్ రామకృష్ణకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన కూన రవికుమార్
ఇక అసలు విషయానికి వస్తే పొందూరు మండలం రామసాగరంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారంటూ ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ రామకృష్ణ అక్కడకు వెళ్ళి అక్కడ అక్రమ తవ్వకాలు జరుపుతున్న నాలుగు లారీలు సీజ్ చేశారు. ఐతే ఆ లారీలు కూన సోడరుడివి. తన సోదరుడికి చెందిన లారీలను సీజ్ చేసి రెండురోజులైనా కేసు నమోదు చేయకపోవడంతో కూనరవి కుమార్ రంగంలోకి దిగారు . మే18న తహసీల్దార్ రామకృష్ణకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
తహసీల్దార్ ను నోటికొచ్చినట్టు తిట్టిన టీడీపీ నేత
తమకు చెందిన వాహనాల పై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీసిన ఆయన కేసు నమోదు చేయకపోతే లంచం అడుగుతున్నావని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు . ఈక్రమంలో తహసీల్దార్ పై కూన నోరు పారేసుకున్నారు .రూల్స్ తెలియదా అంటూ తహసీల్దార్ ను నోటికొచ్చిన బూతులు తిట్టారు . ఒకవేళ కేసులు పెట్టే ఉద్ధేశం లేకపోతే ... ఎంత లంచం కావాలో అడిగితే అంతా ఇస్తా అంటూ కూడా ఆఫర్ చేశారు. తహసీల్దార్ ను ప్రలోభానికి గురి చేసే యత్నం చేశారు .
తహసీల్దార్ ఫిర్యాదు .. కేసు నమోదు .. అజ్ఞాతం వీడి సరెండర్ అయిన కూన
ఇక తహసీల్దార్ రామకృష్ణ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు , బెదిరించినందుకుగానూ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పొందూరు పోలీసులు. దీంతో కూన అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు . ఐతే అప్పటికే కూనరవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మే 25న తెల్లవారు జామున శ్రీకాకుళం...శాంతినగర్ కాలనీలో ఉన్న కూన ఇంటికి వెళ్లిన పోలీసులు అతని కోసం ఇల్లంతా వెతికారు. కూన ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు . ఈ క్రమంలో మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన ఈ రోజు పోలీసులకు స్వయంగా లొంగిపోయారు.
గతంలోనూ కూన రవికుమార్ పై ఇదే తరహా ఆరోపణలు
గతంలో కూడా కూన ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు . ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తూ, దురుసుగా ప్రవర్తించారన్న వ్యవహారంలో ఆయనపై గతంలో కూడా కేసు నమోదైంది. కూన రవిపై సరబుజ్జిలి పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో అప్పుడు సైతం ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక తాజాగా మరో కేసు నేపధ్యంలో కూన పోలీసులకు సరెండర్ అయ్యారు.