ఓ సీఐ గెలిచారు..ఓ ఐపీఎస్ అధికారి ఓడిపోయారు!
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికల్లో కొన్ని అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. పోలీసు శాఖకే చెందిన ఇద్దరు అధికారులు వేర్వేరు పార్టీలు, వేర్వేరు ప్రాంతాల నుంచి ఎన్నికల బరిలో దిగారు. వారిలో ఒకరిది అత్యున్నత హోదా. ఐపీఎస్ అధికారి. మరొకరు సీఐ. ఇద్దరూ లోక్సభకు పోటీ చేశారు. ఐపీఎస్ అధికారి దారుణంగా పరాయజం పాలవ్వగా.. సీఐ రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. జెయింట్ కిల్లర్గా గుర్తింపు సాధించారు. వారే.. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ, గోరంట్ల మాధవ్.
జేడీని తన ఇంటి పేరుగా మార్చుకున్న లక్ష్మీ నారాయణ పేరును తెలియని వారు బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. ఆస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైఎస్ జగన్ అరెస్టు అనంతరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీనారాయణ పేరు మారుమోగిపోయింది. ఆయనను ఆహ్వానించని విద్యాసంస్థలు లేవు. సన్మానించని సంఘాలు లేవు. అదే సమయంలో- తమ వద్ద తగినంత సిబ్బంది లేరంటూ చంద్రబాబు నాయుడి ఆస్తులపై విచారణ చేపట్టడానికి వెనుకాడినప్పటికీ.. ఆ విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు.
వైఎస్ జగన్ అరెస్టు అక్రమం అనే విషయం క్రమంగా తేలుతూ వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారులందర్నీ నిర్దోషులుగా గుర్తించింది న్యాయస్థానం. వారిపై నమోదైన కేసులను కొట్టి పడేసింది. ఈ క్రమంలో- వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. రాజకీయాల్లో చేరారు. మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంవీవీ సత్యనారాయణ ఇక్కడి నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ రెండో స్థానంలో నిలిచారు.
ఐపీఎస్ అధికారిగా, సీబీఐ జాయింట్ డైరెక్టర్గా లక్ష్మీనారాయణతో పోల్చుకుంటే గోరంట్ల మాధవ్ అతి సాధారణ వ్యక్తి. ఓ మామూలు సర్కిల్ ఇన్స్పెక్టర్. అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తారని, ఎవరి ప్రలోభాలకు లొంగరని చెబుతుంటారు స్థానికులు. పోలీసులను దూషించిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని మీసం మెలేసి సవాల్ చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా అనంతపురం జిల్లాలో బలమైన జేసీ కుటుంబాన్ని ఎదిరించారు.
క్రమంగా ఆయన కూడా రాజకీయాల వైపు మొగ్గు చూపారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరున్న హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. లక్షఓట్లకు పైచిలుకు మెజారిటీతో ఘన విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ మాట ఎలా ఉన్నా, గోరంట్ల మాధవ్ నిజాయితీకి ప్రజలు పట్టం కట్టారనే విషయం ఇక్కడ స్పష్టమౌతోంది.
రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలతో పోల్చుకుంటే.. విశాఖపట్నం పరిధిలో విద్యావంతులు అత్యధికం. సామాజిక చైతన్యం ఎక్కువ. అలాంటి చోటే లక్ష్మీనారాయణ దారుణంగా ఓడిపోయారు. దీన్ని బట్టి చూస్తే- రాజకీయ కారణాలతోనే లక్ష్మీనారాయణ అక్రమ కేసులు బనాయించి వైఎస్ జగన్ను అరెస్టు చేశారనే విషయాన్ని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, దీనికి నిదర్శనమే లక్ష్మీనారాయణ ఓటమి అని అంటున్నారు.