షాకింగ్: జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు మంతనాలు!
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆ పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. తెలంగాణలో దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తెలుగువాడి ఆత్మగౌరవం అనే పునాదుల మీద నిర్మితమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో మనుగడ కోసం కష్టపడుతోంది. ఆవిర్భావం నుంచీ టీడీపీలో ఉంటూ వచ్చిన గరికపాటి రామ్మోహన్ రావు, నామా నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నాయకులు పార్టీని ఫిరాయించారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితికి చేరుకుంది టీడీపీ. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. తెలంగాణ టీడీపీ నుంచి కొనసాగుతోన్న వలసలకు ఇప్పట్లో ఆగేలా లేవు.
వైభవాన్ని కోల్పోయినట్టేనా?
ఏపీలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ఒక్కసారిగా పీఠాన్ని కోల్పోయిన తరువాత.. కుదేలైంది. పార్టీని అంటి పెట్టుకుని ఉంటూ వచ్చిన నాయకులు కమలం నీడన చేరిపోయారు. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నాయకులు టీడీపీని వీడటం ఆ పార్టీలో నెలకొన్న దారుణ స్థితికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాల కాలం పాటు అధికారాన్ని చలాయించిన ఈ పార్టీ ఇలాంటి దుస్థితికి చేరుకోవడం అంచనాలకు కూడా అందని విషయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హరికృష్ణ సంవత్సరీకంలో ఘటన..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ సంవత్సరీకం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ గత ఏడాది ఆగస్టు 29వ తేదీన సూర్యాపేట జిల్లా నార్కట్ పల్లి సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. హరికృష్ణ సంవత్సరీకాన్ని ఆదివారం నిర్వహించారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమాన్ని హరికృష్ణ కుమారులు, నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కుమార్తె నందమూరి సుహాసిని నిర్వహించారు. దీనికి చంద్రబాబు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నందమూరి హరికృష్ణ నివాసానికి వచ్చిన చంద్రబాబు నాయుడు.. చిత్రపటానికి పూలు చల్లి నివాళి అర్పించారు. శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు.. జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడటం కనిపించింది. ఓ పక్కగా తీసుకెళ్లి.. కొద్దిసేపు ఏకాంతంగా జూనియర్ ఎన్టీఆర్ తో మంతనాలు సాగించారు. కొద్దిసేపటి తరువాత కళ్యాణ్ రామ్ కూడా వారితో కలిశారు.
రాజకీయాలు ప్రస్తావనకు రాలేదంటోన్న కుటుంబ సభ్యులు..
చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. వారిద్దరి మధ్య ఎలాంటి రాజకీయలు చర్చకు రాలేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ- చంద్రబాబు చాలాసేపు ఎన్టీఆర్ తో మంతనాలు సాగించడం, మధ్యమధ్యలో ఆయన భుజంపై చేతులు వేస్తూ మాట్లాడటం ఆసక్తి రేపింది. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలోనే పార్టీ కండువాను కప్పుకొన్నారు. అప్పట్లో ఆయన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తిన సంఘటన తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తన మామను వైఎస్ఆర్ సీపీలో చేరాలని సూచించినట్లు అప్పట్లో వార్తలు కూడా వెలువడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ సైతం వైఎస్ఆర్ సీపీలో చేరే అవకాశాలు లేకపోలేదంటూ కొద్దిరోజుల కిందటే వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో- ఎన్టీఆర్ తో చంద్రబాబు నాయుడు మంతనాలు సాగించడం ఆసక్తి రేపింది.