పీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి...?
మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మరోసారి వెలుగులోకి వచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆయనకు కీలక పదవి దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ పీసీసీని ఆఫర్ చేసినట్టుుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నుండి పిలుపురావడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుహ్యంగా తెరమీదకు వచ్చి ఏకంగా సీఎం పదవిని చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం జరిగిన రాష్ట్ర విభజన పరిణామాల్లో చాలా కాలం కనుమరుగయ్యారు. హైకమాండ్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన అనంతరం విభజన సమయంలో పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు. అయినా పెద్దగా ఫలితం మాత్రం రాలేదు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయన దుస్థితికి చేరింది. దీంతో ముఖ్యమంత్రులుగా చేసిన వారు సైతం పార్టీని కాపాడేందుకు ముందుకు రాని దయనీయ పరిస్థితి నెలకొంది.
ఇక పార్టీ ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా కిరణ్కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలోకి వెళతారని ప్రచారం కూడ జరిగింది. కాని కిరణ్కుమార్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నారు. దీంతో ఆయన్ను మరోసారి కీలక పదవిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
దీనిపై సోనియాగాంధితో నేరుగా మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్గా ఉన్న ఉమెన్చాందీ , పార్టీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రతిపాదించగా ఆయనకు ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లారనే వార్తలు వెలువడుతున్నాయి.