పవన్ కు చంద్రబాబుకు బర్త్ డే విషెస్: ప్రాణ స్నేహితుడి వర్ధంతిని విస్మరించారెందుకంటోన్న ఫ్యాన్స్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టార్గెట్ అయ్యారు. ఆయన చేసిన ఓ ట్వీట్.. దీనికి కారణమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మాజీ నాయకుడు, దివంగత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయనకూ నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు చంద్రబాబు. అదే సమయంలో- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. నిజానికి- రాజకీయాల్లో వారిద్దరూ ప్రత్యర్థులు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
పవన్ కు ఒకలా..వైఎస్ కు ఇంకోలానా?
ఇక్కడే చిన్న ట్విస్ట్ వచ్చి పడింది. వైఎస్ అంటే తనకు ఏ మాత్రం ధ్వేషం లేదని, ఆయనపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని కొద్దిరోజుల కిందటే చంద్రబాబు నిండు సభలో స్పష్టం చేశారు. రాజకీయ సంబంధమైన వైరం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఈ రకంగా చూస్తే..ప్రాణ స్నేహితుడి వర్ధంతి నాడు ఎందుకు నివాళి అర్పించట్లేదని నిలదీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రాజకీయంగా చూసుకుంటే పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు నాయుడికి శతృవేనని, మరలాంటప్పుడు ఎందుకు ఈయనను శుభాకాంక్షలు చెప్పారనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీన్ని అడ్డుగా పెట్టుకుని చంద్రబాబును విమర్శించడానికి ఎంతమాత్రమూ వెనుకాడట్లేదు ఆ పార్టీ అభిమానులు. ఆ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందాలకు ఇదే నిదర్శనమని విమర్శిస్తున్నారు.
వినాయకుడికి వేల రూపాలని ఊరకే అన్నారా? చంద్రయాన్ 2 సీజన్ మరి!
హరికృష్ణకు నివాళి
సోమవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు. అదే రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత నందమూరి హరికృష్ణ జయంతి కూడా. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సైతం సోమవారమే. ఈ సందర్భంగా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీనటుడిగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించారని చంద్రబాబు చెప్పారు. విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ నిండు నూరేళ్ల పాటు జీవించాలని, సంపూర్ణ ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు అందులో పొందుపరిచారు. అంతకుముందు- నందమూరి హరికృష్ణకు నివాళి అర్పిస్తూ ఓ ట్వీట్ చేశారు.
వైఎస్ ను విస్మరించారేమీ?
నందమూరి హరికృష్ణ తమ మధ్య లేకపోయినప్పటికీ.. టీడీపీ నాయకుడిగా, రాజ్యసభ మాజీ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎనలేని సేవలు చిరస్మరణీయమని అన్నారు. తన ప్రాణస్నేహితుడిగా చెప్పుకొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు ప్రస్తావించలేదు. వైఎస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు కొద్దిరోజుల కిందటే అసెంబ్లీలో చెప్పుకొన్న విషయం తెలిసిందే. తామిద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని, ఒకే పార్టీలో చాలాకాలం పాటు కొనసాగామని అన్నారు. ఒకే గదిలో కూడా కలిసి నివసించిన సందర్భాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అంతటి ప్రాణ స్నేహితుడికి నివాళి ఎందుకు అర్పించలేదని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభిమానులు. పదవిలో ఉంటూ కన్నుమూసిన ముఖ్యమంత్రిగానైనా గుర్తించవా? అంటూ నిలదీస్తున్నారు.