వీల్ ఛైర్లో మురళీమోహన్: అనారోగ్యానికి అసలు కారణం ఇదే: పరామర్శించిన చంద్రబాబు!
హైదరాబాద్: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యుడు మాగంటి మురళీ మోహన్ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న మురళీమోహన్ నివాసానికి వెళ్లి ఆయనను పలకరించారు. ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శించారు.
అనారోగ్యానికి అసలు కారణం..
మురళీమోహన్కు వెన్నెముకలో ఇబ్బందుల వల్ల శస్త్ర చికిత్స నిర్వహించారు డాక్టర్లు. మురళీ మోహన్ మాతృమూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే. తన తల్లి అస్తికలను పవిత్ర గంగానిదిలో నిమజ్జనం చేయడానికి ఆయన ఈ నెల 14వ తేదీన ఆయన ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), వారణాశికి వెళ్లారు. అక్కడ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వెన్నెముకలో తలెత్తిన ఇబ్బందుల వల్ల కాళ్లు రెండూ చచ్చుపడే స్థితికి చేరుకున్నాయి. ఫలితంగా మురళీమోహన్ నడవలేని స్థితికి చేరుకున్నారు. వారణాశి నుంచి ఆయన హుటాహుటిన హైదరాబాద్కు చేరుకుని, కేర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వెన్నెముకలోని ఎల్-4, ఎల్-5, ఎల్-6 లల్లో సమస్యలు ఉన్నాయని తేలింది. దీన్ని నిర్ధారించుకోవడానికి ఆయన మరో నాలుగైదు ఆసుపత్రుల్లోనూ పరీక్షలు చేయించుకోగా.. అన్నిచోట్లా ఒకే విధమైన రిపోర్టులు వచ్చాయి.
వెన్నెముకకు శస్త్ర చికిత్స..
ఎంత త్వరగా శస్త్ర చికిత్స చేయించుకుంటే అంత మంచిదని అంటూ డాక్టర్లు అందరూ నిర్ధారించారు. ఫలితంగా ఆయన కిందటి నెల 24వ తేదీన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వెన్నెముకకు శస్త్ర చికిత్స అత్యంత సున్నితమైనదిగా భావిస్తారు. శరీరం మొత్తాన్ని సమన్వయం చేసే, బ్యాలెన్స్గా నిలిపే వెన్నెముకకు చేసే శస్త్ర చికిత్సలో ఏ కొంచెం తేడా వచ్చినా, శరీరం మొత్తం చచ్చుపడి పోయే ప్రమాదం ఉంది. కిందటి నెల 24వ తేదీన డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బెడ్ రెస్ట్పై ఉన్నారు. ఈ నెల 7వ తేదీన ఈ శస్త్ర చికిత్సకు సంబంధించిన కుట్లను తొలగిస్తారని మురళీ మోహన్ తెలిపారు. కుట్లను తొలగించిన తరువాత తాను మరికొద్దిరోజుల పాటు బెడ్ రెస్ట్పైనే ఉంటానని తెలిపారు. 10వ తేదీ తరువాత ఆరోగ్యం సహకరిస్తే, తాను రాజమహేంద్రవరానికి వెళ్తానని, ప్రజలను కలుసుకుంటానని అన్నారు.
పరామర్శించిన చంద్రబాబు, నారా లోకేష్
శస్త్ర చికిత్స అనంతరం తలెత్తే సమస్యలు రాకుండా ఆయన శనివారం వరకూ ఆసుపత్రిలోనే ఉన్నారు. అదే రోజు సాయంత్రం ఆయన డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. మురళీ మోహన్ డిశ్చార్జి అయ్యారనే విషయాన్ని తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్తో కలిసి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లారు. పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మురళీమోహన్ తాను ఎలా అనారోగ్యానికి గురైందనే విషయాన్ని చంద్రబాబుకు వివరించారు. ఎన్నికల్లో పార్టీ దారుణంగా పరాజయం పాలైన తరువాత చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలో ఉన్న నివాసం నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన విషయం తెలిసిందే.
కోడల్ని ఎన్నికల్లో దింపి..
2014 లోక్సభ ఎన్నికల్లో మురళీమోహన్ రాజమండ్రి నుంచి పోటీ చేసి, విజయం సాధించిన విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొన్నారు. తన కోడలు మాగంటి రూపకు టికెట్ ఇప్పించుకున్నారు. రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసిన మాగంటి రూప.. పరాజయం పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్గాని భరత్ చేతిలో ఓటమిని చవి చూశారామె. అనారోగ్యం కావచ్చు లేదా హైదరాబాద్లో మురళీమోహన్పై నమోదైన కేసుల వల్ల కావచ్చు.. మురళీ మోహన్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేదు. ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
రూ.2 కోట్లలను తరలిస్తూ..
ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి రెండు కోట్ల రూపాయలను అక్రమంగా తరలిస్తూ మురళీమోహన్ కు చెందిన జయభేరి గ్రూప్ సంస్థల్లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆ డబ్బు మురళీమోహన్ కు చెందినదేనని ఉద్యోగులు స్పష్టం చేశారు. దీనితో ఆయనపై కేసు నమోదైంది. అప్పటి నుంచి మురళీ మోహన్ బాహ్య ప్రపంచంలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఆయనను పరామర్శించిన సందర్భంగా.. మురళీ మోహన్ ఆరోగ్యం బహిర్గతమైంది.