ఏం తమాషాలా?: గ్రామ సచివాలయం పరీక్షల వెనుక భారీ కుంభకోణం: చంద్రబాబు, నారా లోకేష్ అటాక్!
Recommended Video
అమరావతి: గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణ వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ప్రశ్నా పత్రాలను లీక్ చేసి, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలగాటం ఆడారని విమర్శించారు. అవినీతిపరుడికి అధికారాన్ని అప్పగిస్తే.. ఇంకా పెద్ద అవినీతికి పాల్పడతారనే విషయాన్ని వైఎస్ జగన్ రుజువు చేశారని మండిపడ్డారు. గ్రామ వలంటీర్ల పోస్టులన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పంచి ఇచ్చారని, ఇప్పుడు గ్రామ సచివాలయాల పేరుతో కుంభకోణానికి పాల్పడ్డారని వారు ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం వేర్వేరుగా వరుసగా ట్వీట్లను సంధించారు.
గ్రామ సచివాలయం పోస్టుల కోసం ప్రభుత్వం లిఖిత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలు గురువారం వెలువడ్డాయి. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఈ పరీక్షల ద్వారా ఒకేసారి 1,26,728 మంది అభ్యర్థులకు ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలను కల్పించింది. ప్రశ్నాపత్రం లీక్ అయ్యాయని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక శుక్రవారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన క్లిప్ ను చంద్రబాబు, నారా లోకేష్ తమ ట్వీట్లకు జత చేశారు. అందులో ఉన్న కథనాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగాలను అమ్ముకుందని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు.
ప్రశ్నాపత్రాలను లీక్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల పేరిట భారీ కుంభకోణం చేశారని మండిపడ్డారు. లక్షలాది నిరుద్యోగులను దగా చేశారని విమర్శించారు. నిరుద్యోగుల ఉజ్వల భవిష్యత్తుకు ఉరి వేశారని నిప్పులు చెరిగారు. మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక అవినీతిపరుడి చేతికి అధికారం వస్తే జరిగేది ఇంకా పెద్ద అవినీతి అని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరూపిస్తోందని అన్నారు. గ్రామ వాలంటీర్ల పోస్టులన్నీ వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుని, నిరుద్యోగులను ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి మోసం చేశారని చంద్రబాబు చెప్పారు. వైకాపా దళారులు పరీక్ష పేపర్ అమ్మేసిన విషయం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ముందే తెలుసని నారా లోకేష్ ఆరోపించారు.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం నిండాముంచిందని అన్నారు. తుగ్లక్ ప్రభుత్వంపై నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. పేపర్ లీక్ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందేనని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం నిద్రాహారాలు మాని కష్టపడి చదివి పరీక్ష రాస్తే, ప్రభుత్వ పెద్దలు గద్దల్లా పరీక్ష పేపరు ముందే ఎత్తుకుపోయారని ధ్వజమెత్తారు. ఒక్కో ఉద్యోగాన్ని అయిదు లక్షల రూపాయలకు అమ్ముతున్నారనే వార్తలపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఆశలు అడియాశలైన నిరుద్యోగుల కన్నీళ్లకూ ఖరీదు కడతారా? అని ప్రశ్నించారు. పేపర్ లీకుతో 18 లక్షలకు పైగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని చెప్పారు.