టీడీపీలో చేరిన కిషోర్ చంద్రదేవ్, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు: ప్రశంసించిన సుజయ
విజయనగరం/అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఆదివారం టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరారు. మాజీలు గోమాంగో, జయమణిలు చేరారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడం తనకు కొత్త కాదని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి పదేళ్లు పని చేశానని అన్నారు. తన నియోజకవర్గం కాకపోయినా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించానని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. కిడారి, సివేరి హత్యలు దురదృష్టకరమని చెప్పారు. బాక్సైట్ తవ్వకాల వెనుకున్న నిజాలు ప్రజలకు తెలియాలని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కిషోర్ చంద్రదేవ్కు, జగన్కు పోలికనే లేదని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను ప్రయివేటుపరం చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వచ్చే వ్యక్తిపై విచారణ లేదని విమర్శించారు. దేశంలోని అవినీతిపరులను కేంద్రం కాపాడుతోందన్నారు. కిశోర్ చంద్రదేవ్ ఆజాత శత్రువు అని మంత్రి సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. కిశోర్ సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అన్నారు.