మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను మరో నాలుగు నెలలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆగష్టు 5వ తేదీవరకు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగిస్తున్నపేర్కొంటూ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని జీవో విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తొలిసారిగా ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇంటెలిజెన్స్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్న సమయంలో భధ్రతాపరమైన పరికరాల కొనుగోలు విషయంలో గోల్మాల్ చేశారనే ఆరోపణలు ఏబీ వెంకటేశ్వరరావుపై వచ్చాయి. ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ కూడా ఏబీ వెంకటేశ్వరరావుపై సీరియస్గానే వ్యవహరించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను ధృవీకరిస్తూ లేఖ కూడా విడుదల చేసింది.
ఏసీబీ డీజీ ప్రభుత్వానికి సమర్పించిన మధ్యంతర నివేదికలో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను పొడిగించాలని సూచించడంతో ఆమేరకు ఆయన సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. పోలీస్ ఫోర్స్ స్కీమ్ బలోపేతం పేరుతో ఏరోస్టాట్స్, మరియు మానవరహిత వాహనాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇజ్రాయిల్ డిఫెన్స్ మానుఫాక్చరింగ్ సంస్థకు ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్ లీక్ చేశారనే ఆరోపణలు కూడా ఏబీ వెంకటేశ్వరరావుపై వచ్చాయి.
Recommended Video
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ ఏడీజీగా పనిచేసిన వెంకటేశ్వరరావు... ఇజ్రాయిల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ సంస్థ ఆర్టీ ఇన్ఫ్లాటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వచ్చాయి. నిఘా పరికరాల కొనుగోలులో గోల్ మాల్ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఇక వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావును పక్కనబెట్టారు. ఇక అప్పటి నుంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. గత నెలలో తన సస్పెన్షన్పై క్యాట్ను ఆశ్రయించగా అక్కడా వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది.