నాడు లక్ష్మీనారాయణపై జగన్ క్యాంప్ ప్రచారం.. ఆ కేసు ఇలా క్లోజ్
సిబిఐ జెడిగా పని చేసిన లక్ష్మీనారాయణపై అప్పట్లో వైసిపి అధినేత జగన్ క్యాంప్ ఓ అనైతిక ప్రచారం చేసింది. లక్ష్మీ నారాయణ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్/అమరావతి: సిబిఐ జెడిగా పని చేసిన లక్ష్మీనారాయణపై అప్పట్లో వైసిపి అధినేత జగన్ క్యాంప్ ఓ అనైతిక ప్రచారం చేసింది. లక్ష్మీ నారాయణ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఓ మహిళకు ఆయన వందలసార్లు కాల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్ను సంపాదించిన జగన్ వర్గం ఓ మహిళకు చాలాసార్లు ఫోన్ చేశారని, అలా ఎందుకు చేశారని ప్రశ్నించడం ప్రారంభించింది. జగన్ ఆస్తుల కేసు, గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కేసు, ఎమ్మార్ కేసులను అప్పుడు లక్ష్మీనారాయణ చూశారు.
నైతికంగా దెబ్బతీసేందుకు..
ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను నైతికంగా దెబ్బతీసేందుకు వైసిపి ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు గుప్పించారనే వాదనలు వినిపించాయి. దీనిపై తొలుత లక్ష్మీనారాయణ స్పందించక పోయినప్పటికీ, ఆ తర్వాత కేసు పెట్టారు. అనంతరం అది క్లోజ్ అయింది.
చిన్న విషయమేమీ కాదు
అయితే, ఈ కేసు ఆసక్తికరంగా క్లోజ్ అయిందంటూ వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాడు ప్రధాన కేసులను విచారిస్తున్న లక్ష్మీ నారాయణ కాల్స్ను ట్రాక్ చేయడం, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, మరో మహిళ వ్యక్తిగత జీవితాన్ని బయటకు లాగడం చిన్న విషయం కాదు.
కేసుల్లో దూకుడుగా ఉన్నా...
జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కేసు, ఎమ్మార్ కేసుల్లో ఆయన దూకుడు ప్రదర్శించారు. అలాంటి లక్ష్మీనారాయణ జగన్ పార్టీ వ్యక్తిగత విమర్శలపై తొలుత మౌనం వహించినా, ఆ తర్వాత కేసు పెట్టారు. దీంతో సిఐడి రంగంలోకి దిగింది. ఆ తర్వాత ప్రధాన నిందితుడు రఘురామ కృష్ణంరాజు అరెస్టు, బెయిల్ పైన విడుదల జరిగింది. నాగపూర్ టెలికాం ఉన్నతాధికారి ముందస్తు బెయిల్ పొందాడు. ఈ కేసులో చాలామంది నిందితులుగా ఉన్నారు.
అలా క్లోజ్..
ఆ తర్వాత లక్ష్మీ నారాయణ తన ఒరిజినల్ కేడర్ మహారాష్ట్రకు వెళ్లి జాయినయ్యాడు. 2015లో సిఐడి సాక్ష్యాలు లేవని కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఛార్జీషీటులో సాక్షాలు ఉన్నట్లుగా కనిపించిందని అంటున్నాయి. ఆ తర్వాత కోర్టు రెండుసార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత కోర్టు కూడా కేసును మూసేసింది.