హామీలను బాండ్ పేపర్ మీద రాసి మ్యానిఫెస్టో విడుదల చేసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. విశాఖలో హోరాహోరీగా పోరు జరుగుతుంది. విశాఖపట్టణం లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలో ఉన్న జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాను నామినేషన్ వేసిన రోజున చేసిన ప్రకటనకు కట్టుబడి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సంచలనం .. నాది ఉడుం పట్టు ,ఆయనలా కేసును మధ్యలో వదిలిపెట్టను
మేనిఫెస్టో బాండ్ పేపర్ మీద రాసి ప్రకటించిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
జనసేన విశాఖ లోక్ సభ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ విశాఖపట్టణం మేనిఫెస్టోను బాండ్ పేపర్ మీద రాసిస్తానని ప్రకటించారు.అన్న మాట ప్రకారం మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఏప్రిల్ 06వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నికల మేనిఫెస్టో బాండ్ పేపర్ మీద రాసి జేడీ రిలీజ్ చేశారు. రూ. 100 బాండ్ పేపర్పై హామీలను పొందుపరచిన ఆయన హామీలు నెరవేర్చకుంటే లీగల్ గా చర్య తీసుకోవచ్చని చెప్పి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు .
బాండ్ పేపర్లో హామీలతో పాటు తన విజన్ కూడా ప్రకటించిన మాజీ జేడీ
ఇక ఆయన విశాఖ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నాడు కాబట్టి విశాఖలోనే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఒక ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తానని తాను రాసిచ్చిన బాండ్ పేపర్ లో పొందు పరిచారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట్ వేదికగా తనవంతు కృషి చేస్తానని, విశాఖ సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు.ప్రతి మూడు నెలలకు ఇచ్చిన హామీలను..సమస్యల పరిష్కారానికి చేసిన పురోగతిపై నివేదిక.. 'రీచ్ యువర్ ఎంపీ' పేరిట యాప్ని రిలీజ్ చేసి ప్రజల ముందుంచుతానని తెలిపారు. ఒక ఆదర్శ ఎంపీగా, మీ వాడిగా , మీ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని తెలిపారు.
విశాఖ సమస్యలు తీర్చకుంటే బాండ్ ఆధారంగా లీగల్ గా చర్యలు తీసుకోండి అంటున్న లక్ష్మీ నారాయణ
విశాఖలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన జేడీ..మరికొన్ని హామీలను అందులో పొందుపరిచారు. వైజాగ్ వాసుల అతిపెద్ద సమస్య తాగునీరు .ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని చెప్పిన లక్ష్మీ నారాయణ కాలుష్య నియంత్రణ కోసం 5 ఏళ్లలో విద్యార్థుల భాగస్వామ్యంతో రెండు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంటానని నియోజకవర్గ అభివృద్ధికి తన విజన్ ఏంటో అది అంతా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయ్యకపోతే కోర్టుకు కూడా లాగొచ్చని జేడీ తెలిపారు. మరి హామీలన్నీ బాండ్ మీద రాసి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్న మాజీ జేడీ లక్ష్మి నారాయణను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి .