వైఎస్ వివేకానందరెడ్డి పై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎవరితోనూ గొడవలకు దిగని సౌమ్యుడు అని, అన్ని పార్టీల నేతలు ఇష్టపడే నాయకుడు అని ఆయనకు మంచి పేరుంది. ఇక ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత లక్ష్మీ నారాయణ సైతం తెలిపారు .
చాలా కాలంగా ఏపీలో విస్తృతంగా పర్యటన చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని , రాజకీయాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చెయ్యాలని భావించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇటీవల జనసేన పార్టీ లో చేరి జనసేన నుండి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపధ్యంలో ఆయన ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో చాలా ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గురించి ఆయన చెప్పిన విషయాలు ఆసక్తిని కలిగించాయి.
వివేకా వ్యక్తిత్త్వం చాలా మంచిదని మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. లక్ష్మీనారాయణకు, టీడీపీ నేత పయ్యావుల కేశవ్కు బంధుత్వాన్ని అంటగడుతూ.. అప్పట్లో వివేకానంద రెడ్డి ఆరోపణలు చేశారు . తీవ్ర స్థాయిలో లక్ష్మీ నారాయణపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వివేకా తనకు ఫోన్ చేసి... బాబూ తప్పైంది.. వేరే వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అలా మాట్లాడాను. ఆఫీసుకు వచ్చి క్షమాపణలు చెబుతాను అన్నారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తప్పును తప్పని ఒప్పుకునే వ్యక్తిత్వం ఆయనది అని గుర్తు చేసుకున్నారు లక్ష్మీ నారాయణ . ఇంకా అంతే కాకుండా ఎవరో చెప్పినది విని అలా రియాక్ట్ అయ్యుంటారని.. కాబట్టి దీన్ని అంత సీరియస్గా తీసుకోనవసరం లేదని తాను వివేకాతో చెప్పానన్నారు. ఆయన ఆలోచన తీరు అలా ఉంటుందని లక్ష్మీనారాయణ అన్నారు. మొత్తానికి దివంగత వై ఎస్ వివేకా వ్యక్తిత్వం మంచిది అని జనసేన నేత లక్ష్మీ నారాయణ కితాబివ్వటం , ఆయన్ను గుర్తు చేసుకోవటం ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరంగా మారింది.