ఏపీ బీజేపీ సీఎం రేసు ప్రచారంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన
అమరావతి: తాను గతంలో జనసేనలో, తాజాగా బీజేపీలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత రాజకీయపరంగా ఓ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రైతులు సబ్సిడీలు, పథకాలను ఆశించడం లేదని, పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే చాలన్నారు.
రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. అయితే, ఈ మధ్య ఆరెస్సెస్కు సంబంధించిన ఓ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. దీంతో, ఆయన బీజేపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు పార్టీ గురించి, ఎన్నికల్లో పోటీ గురించి ఆయన ఇంతవరకు మాట్లాడకపోయినా తనకు వ్యవసాయ మంత్రిగా పని చేయాలని ఉందని ఓసారి అన్నారు.
ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణా లేక కన్నా లక్ష్మీనారాయణా అని విలేకరులు అడగగా.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఎవరిని నియమిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ అన్నట్లుగా ప్రచారం సాగింది. దీనిపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పైవిధంగా స్పందించారు.