ఓటమిపై స్పందించిన జనసేన నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ జనసేన ఏపీలో శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఇక లోక్ సభలో ఖాతా తెరవలేదు .పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతగా , సిన్సియర్ ఆఫీసర్ గా గుర్తించబడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం ఘోరంగా ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ 3వేల 723 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్పై విజయం సాధించారు.లక్ష్మీ నారాయణ కనీసం గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు . మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
ఇక తన ఓటమిపై లక్ష్మీ నారాయణ స్పందించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ పడ్డ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, తన ఓటమిపై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు . ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని అన్నారు. విజయం సాధించిన నరేంద్ర మోదీ, జగన్ లకు అభినందనలు తెలిపారు. తనపై విజయం సాధించిన ఎంవీవీ సత్యనారాయణను అభినందించారు. కొత్త ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు సేవ చేసే విషయమై తనపని తాను చేసుకు వెళతానని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .
మూడో స్థానంలో జనసేన విశాఖ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలు