హాని జరిగితే ఎస్పీదే బాధ్యత... వేధింపులపై రాష్ట్రపతిని కలుస్తా : మాజీ మంత్రి అఖిల ప్రియ
మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై కేసుల వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. క్రషర్ కు సంబంధించిన కేసు సివిల్ కేసు అని అయినప్పటికీ కావాలనే ఈ కేసును రాజకీయం చేస్తున్నారని అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన భర్త భార్గవ్ రామ్ ను పట్టుకునేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ దాకా రావటంపై ఆమె మండిపడుతున్నారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ ఫైర్ అవుతున్నారు.
నా భర్త అదృశ్యం.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన.. వైసీపీ కారణమంటూ..
సివిల్ కేసులో పోలీసుల జోక్యంపై మాజీ మంత్రి ఫైర్
వ్యాపార లావాదేవీల్లో భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కావాలని టీడీపీ నాయకులను వేదిస్తున్నారన్న అఖిల ప్రియ చిన్న విషయాన్నిపెద్దది చేస్తున్నారని పోలీసులు, మరియు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు . అంతే కాదు కర్మూలు ఎస్పీ ఫకీరప్పపై ఆమె నిప్పులు చెరిగారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారని, కావాలనే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమకు ఏదైనా హాని జరిగితే ఎస్పీ ఫకీరప్పదే బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ఫకీరప్పపై నిప్పులు చెరిగిన అఖిల ప్రియ
తమ కుటుంబానికి వేధింపులు కొత్త కాదు అని పేర్కొన్న భూమా అఖిల ప్రియ జిల్లా ఎస్పీ ఫకీరప్ప తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించారు. భయపెడితే భయపడే స్థితిలో తాను లేనని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు తమను ఇలాగే వేధింపులకు గురి చేస్తే ఎక్కడి దాకా అయినా వెళ్తానని ఆమె పేర్కొన్నారు. అవసరం అనుకుంటే గవర్నర్ ను కలుస్తానని , అక్కడ కాకుంటే రాష్ట్రపతి దాకా అయినా వెళ్తానని ఆమె గట్టిగా చెప్పారు.
పోలీసు ఉన్నతాధికారులతో గట్టిగా మాట్లాడిన మాజీ మంత్రి
క్రషర్ వివాదంలో బెదిరింపు కేసులో ముద్దాయిగా ఉన్న ఆమె భర్త భార్గవ్రామ్ని ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు హైదరాబాద్ కు వెళ్ళిన నేపధ్యంలో పోలీసుల తీరుపై మండిపడ్డారు. భార్గవ్ను ప్రశ్నించాలంటే ముందు తనను దాటుకొని వెళ్లమంటూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు భూమా అఖిల ప్రియ వారెంట్ చూపించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు జిల్లా పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో గట్టిగా మాట్లాడారు అఖిలప్రియ.
టీడీపీలో కేసులతో ఇబ్బంది పడుతున్న వారి జాబితాలో అఖిల ప్రియ
ఇక టీడీపీ నేతలైన చింతమనేని, యరపతినేని, తాజాగా జేసీ బ్రదర్స్ .. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది నేతలు అనేక కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ విషయంలో గవర్నర్ కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో భర్తపై కేసులు నమోదై ఇబ్బంది పడుతున్న జాబితాలో భూమా అఖిల ప్రియ కూడా చేరారు. వైసీపీ సర్కార్ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులలో భాగమే ఈ తప్పుడు కేసులు అని ఆమె అభిప్రాయపడుతున్నారు.