వైఎస్ఆర్ సీపీ గూటికి కొత్తపల్లి: త్వరలో చేరిక!
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల వేళ, నామినేషన్ల పర్వ ఊపందుకుంటున్న సమయంలో, తెలుగుదేశంలో టికెట్ ఆశించి, చివరి నిమిషంలో భంగ పడ్డ సీనియర్ నాయకులు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా- టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఇప్పటిదాకా ఆయన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు.
పవన్ కల్యాణ్ అలా మాట్లాడితే ఊరుకోం..! జనసేనానిపై తెలంగాణలో కేసు
వచ్చే ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. పార్టీ అగ్ర నాయకత్వం నుంచి టికెట్ ఖాయమనే సంకేతాలుఅందడంతో ప్రచార కార్యక్రమాలకు కూడా రోడ్ మ్యాప్ రూపొందించుకున్నారు. చివరి నిమిషంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు. ఈ స్థానాన్ని శివరామరాజుకు కేటాయించారు. దీనితో తీవ్ర అసంతృప్తికి గురైన కొత్తపల్లి సుబ్బారాయుడు తన అనుచరులతో సమావేశం అయ్యారు. అనంతరం- వైఎస్ఆర్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఆదివారం హైదరాబాద్ లోటస్పాండ్లో వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ను కలిశారు. పార్టీలో చేరాలన్న తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మరో రెండు రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.. ఆ సమయంలో కొత్తపల్లి సుబ్బారాయుడు అధికారికంగా వైఎస్ఆర్ సీపీలో చేరబోతున్నారు. హైదరాబాద్ లో ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. నర్సాపురం వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రఘురామ కృష్ణంరాజు విజయానికి కృషి చేస్తానని అన్నారు. అదే లోక్ సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని చెప్పారు.
కొత్తపల్లి సుబ్బారాయడు గతంలో మూడుసార్లు నర్సాపురం నుంచి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1994, 1999, 2004లో టీడీపీ తరఫున విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ కు చెందిన ముదునూరి ప్రసాదరాజు చేతిలో ఓడారు. 2014లో వైఎస్ఆర్ సీపీలో చేరారు. నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ టీడీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. తాజాగా నర్సాపురం టికెట్ ఆశించి, భంగపడ్డారు. దీనితో మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరారు.