అచ్చెన్నాయుడు బెయిల్ మరింత ఆలస్యం- మరోసారి విచారణ వాయిదా...
ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయడుకు బెయిల్ మరింత ఆలస్యం కానుంది. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి వాదనలు విన్న హైకోర్టు విచారణను మళ్లీ వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం తన వాదనలు వినిపించారు. ఈ నేరంలో చాలా తీవ్రత ఉందని, అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే నేరం జరిగిందని కోర్టుకు తెలిపారు. నేరంగా ఆయన ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు.
2016 సెప్టెంబర్ నుంచి అక్రమాలకు పాల్పడిన కంపెనీలకు అనుకూలంగా అచ్చెన్నాయుడు లేఖలు ఇచ్చారని, ఈ వివరాలు దిగువ కోర్టుకు సమర్పించినట్లు ఏజీ తెలిపారు. 2016 సెప్టెంబర్ 25న అప్పటి మంత్రి నివాసంలో జరిగిన సమావేశం ఉద్దేశం, మినిట్స్ తీసుకోవాలని కోర్టును కోరారు. ఆ రోజు సమావేశానికి హాజరైన వ్యక్తులందరినీ అరెస్టు చేసినట్లు ఏజీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీలోనూ అమలు చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. గతంలో ఎక్కడా పని చేసిన అనుభవం లేని టెలీ హెల్త్ సర్వీసెస్ కు టెండరింగ్, ఈ-ప్రొక్యూర్ మెంట్ తో సంబంధం లేకుండా కాంట్రాక్టు ఇచ్చారని ఏజీ వివరించారు.
ఆ తర్వాత అచ్చెన్నాయుడు తరఫున న్యాయవాది వాదిస్తూ.. అప్పుడు మంత్రిగా తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు గవర్నర్ కానీ, స్పీకర్ అనుమతి కానీ తీసుకోవాలని తెలిపారు. అయితే అచ్చెన్నాయుడు మంత్రిగా తన విధుల ప్రమాణాలు విస్మరించినందున విచారణ, దర్యాప్తులకు అనుమతి అవసరం లేదని ఏజీ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. తర్వాత విచారణ ఎప్పుడన్నది త్వరలో నిర్ణయిస్తామని న్యాయమూర్తి తెలిపారు.