మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా - హైకోర్టుకు లేఖ రాయనున్న రమేష్ ఆస్పత్రి...
అమరావతి : ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు పాజిటివ్ రావడంతో ఆందోళన చెందిన డాక్టర్లు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్దితిపై హైకోర్టుకు లేఖ రాయాలని వారు నిర్ణయించారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం ఆస్పత్రి హైకోర్ట్కు బులెటిన్ ఇస్తోంది. కాగా ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు రమేష్ ఆస్పత్రి వైద్యులు కరోనా చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్నకు పాజిటివ్ రావడంతో కుటుంబీకులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
రెండు నెలల క్రితం ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన తర్వాత ఆయన బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు కూడా ఆయనకు బెయిల్ తిరస్కరించాయి. దీంతో అనారోగ్యం దృష్ట్యా కనీసం కోరుకున్న ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని కోరడంతో రమేష్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. దాదాపు రెండు నెలలుగా రమేష్ ఆస్పత్రిలోనే ఉన్న ఆయనకు కరోనా ఎలా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.