మాజీమంత్రి దేవినేని ఉమా రిలీజ్.. పీఎస్ వద్ద ఉద్రికత..
ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఉమ విడుదలతో అక్కడున్న టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. ఉదయం కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పలు నాటకీయ పరిణామాల మధ్య పమిడిముక్కల పోలీస్ స్టేషన్కు తరలించారు.
తొలుత గొల్లపూడి నుంచి పోలీసుల కాన్వాయ్ ఈలప్రోలు దిశగా వెళ్లడంతో ఉమను మైలవరం కానీ, ఇబ్రహీంపట్నం కానీ తీసుకెళతారని టీడీపీ శ్రేణులు భావించాయి. ఉమను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో వెంటనే పమిడిముక్కలకు తీసుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పమిడిముక్కల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరికీ ఈ సాయంత్రం విడుదల చేశారు. ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ దేవినేని ఉమ ఉదయం గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో.. తిరిగి విడుదల చేశారు.