నన్ను ఇంటిగడప కూడా తొక్కొద్దంటారా?: టీడీపీ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తా: మాజీమంత్రి
మైదుకూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి అధికార తెలుగుదేశం పార్టీలో ఘోర అవమానం ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ టికెట్ ను కేటాయిస్తామని హామీ ఇచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చివరి నిమిషంలో ఆయనకు మొండిచెయ్యి చూపారు. కనీసం ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇస్తానని భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా డీఎల్ వెల్లడించారు. తన అనుచరులతో సోమవారం ఆయన స్వస్థలం ఖాజీపేటలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వారితో చర్చించారు. తెలుగుదేశం పార్టీ తనకు చివరి నిమిషంలో మోసం చేసిందని డీఎల్ వాపోయారు.
చంద్రబాబు ఎప్పుడూ అనుసరించే యూజ్ అండ్ త్రో పాలసీకి తాజాగా తాను బలి అయ్యానని డీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి, తనను పార్టీలో చేరాలని ఆహ్వానించారని గుర్తు చేశారు. దీనితో తాను అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిశానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరితే మైదుకూరు అసెంబ్లీ టికెట్ ను ఇస్తానని మొదట్లో చంద్రబాబు తనకు హామీ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డానని అన్నారు. తనకు తెలియకుండానే మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థి పేరును ఖరారు చేశారని చెప్పారు. తాను రాజీ కోసం టీడీపీ నియోజకవర్గం ఇన్ ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా.. గడప కూడా తొక్కొద్దని ఆయన హెచ్చరించారని డీఎల్ చెప్పుకొచ్చారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఎలా గెలుస్తాడో చూస్తానని అన్నారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలామందికి బీఫారాలను ఇప్పించానని, అలాంటిది తాను బీఫారం కోసం టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, జనసేన, బీజేపీలను అడుగుతుండడం తనకే సిగ్గుగా ఉందన్నారు. ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో టీడీపీకి పునాదులు లేకుండా చేస్తానని, తనకు ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడిస్తానని డీఎల్ ధీమా వ్యక్తం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గనని, మంచి రోజులు వస్తాయని, అధైర్య పడొద్దని కార్యకర్తలకు సూచించారు.