జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీమంత్రి డొక్కా: చేరికపై ఏమన్నారంటే
మండలి సమావేశాల సమయంలో టీడీపీకి షాక్ ఇచ్చి మండలికి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నేడు టీడీపీకి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి షాక్ ఇచ్చిన ఆయన నేడు మధ్యాహ్నం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్న ఎమ్మెల్సీగా నేడు పార్టీకి గుడ్ బై చెప్పిన డొక్కా మాణిక్య వర ప్రసాద్ నేడు వైసీపీ తీర్ధం పుచ్చుకోవటం టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి .
వైసీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్
నేడు మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయన సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా డొక్కాకు వైసీపీ కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం పని చెయ్యాలని కోరారు. ఇక డొక్కా మాణిక్య వర ప్రసాద్ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ మారిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఆయన మండలికి రాజీనామా చేశారు.
టీడీపీకి గుడ్ బై.. ఆపై వైసీపీకి జై
ఇక తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన రాజీనామా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే డొక్కా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి సీఎం జగన్ వద్దకు వెళ్ళిన డొక్కా వరప్రసాద్ పార్టీలో చేరాక మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే వైఎస్సార్సీపీలో చేరానని ప్రకటించారు.
టీడీపీలో సరైన గౌరవం దక్కలేదని ఆవేదన
సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. 2014లోనే వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, కానీ అనుకోని కారణాల వల్ల టీడీపీలో చేరవల్సి వచ్చిందని వివరించారు. టీడీపీలో సరైన గౌరవం లభించలేదని, కాలం కలసిరాలేదని అన్నారు. అంతేకాదు తనపై వచ్చిన విమర్శలు తనను తీవ్రంగా కలచివేశాయని, టీడీపీలో సరైన గౌరవం దక్కలేదని ఆయన పేర్కొన్నారు.
Recommended Video
తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన డొక్కా
సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలు బాధించాయని చెప్పిన డొక్కా అసెంబ్లీ సమావేశాలకు ముందే నేను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపాను. కానీ వైసీపీ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. నేను ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవ కోసమే పని చేస్తాను. అయితే కొన్ని ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో జేఏసీ పేరుతో నామీద అవినీతి ఆరోపణలు చేశారు. అటువంటి చౌకబారు విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని డొక్కా పేర్కొన్నారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన ఏ పార్టీలో ఉన్నా నా ప్రవర్తనా తీరు తెన్నులు ప్రజలకు సుస్పష్టం అని డొక్కా చెప్పారు. టీడీపీ నేతల విమర్శలపై విరుచుకుపడ్డారు.