నగరి టిక్కెట్పై గాలి కుటుంబం ఏకాభిప్రాయం, చంద్రబాబు కోర్టులో బంతి
నగరి: వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం అభ్యర్థిత్వంపై ఆదివారం చర్చలు జరిగాయి. శనివారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చాలాసేపు చర్చించారు. గాలి కుమారులు భాను, జగదీశ్లు తమకే టిక్కెట్ కావాలని పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గంలో ముఖ్య నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. గాలి కుటుంబంలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని వారు చెప్పారు. దీంతో బాను, జగదీశ్ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరినీ ఒక్కతాటి పైకి తీసుకు వచ్చేందుకు ఇతర నేతలకు సూచించారు.
చదవండి: గాలి ముద్దుకృష్ణమ ఇంట్లో కుటుంబ పోరు:ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు కొడుకుల యత్నం
గాలి ముద్దుకృష్ణమ ఉన్నంత వరకు అందరూ ఒకక్కటిగా ఉన్నారని, చనిపోయాక పరిస్థితులు మారిపోయాయని, ఇది సరికాదని చంద్రబాబు అన్నారు. ఆదివారంలోగా ఏకాభిప్రాయానికి రాకుంటే మరొకరికి బాధ్యతలు అప్పగిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గాలి కుటుంబానికి సన్నిహితుడైన బుద్ధా వెంకన్న రంగంలోకి దిగారు.
ఆదివారం వారితో సమావేశమయ్యారు. దీంతో ఏకాభిప్రాయానికి వచ్చారు. కుటుంబంలోని విభేదాలు చక్కదిద్దుకునేందుకు గాలి సతీమణి, కుమారులు భాను, జగదీశ్ సమావేశమయ్యారు. వారితో బుద్ధా వెంకన్న చర్చించారు. నగరి టిక్కెట్ తమ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. బయటి వారికి ఇచ్చినా గెలుపుకు కృషి చేస్తామన్నారు. రేపు చంద్రబాబుకు ఇదే చెబుతామన్నారు. మరోవైపు నగరి టిక్కెట్ కోసం విద్యాసంస్థల అధిపతి అశోక్రాజు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ టిక్కెట్ చంద్రబాబు కోర్టులో ఉంది. ఆయన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.