రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం ఇక్కడి నుండే బిజెపి పతనం: గోరంట్ల
రాజమండ్రి: ఏపీ నుండే బిజెపి పతనం ప్రారంభంకానుందని మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంబ్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రధానమంత్రి మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
గురువారం నాడు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. దేశానికి నష్టం కల్గించేలా బిజెపి విధానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితులను తీసుకొచ్చారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.
రాజకీయ ప్రయోజనాలే బిజెపికి ముఖ్యంగా మారాయన్నారు.అందుకే అవినీతిపరును కూడ ప్రోత్సహిస్తున్నారని బుచ్చయ్య చౌదరి పరోక్షంగా వైసీపీ నేతలపై ఉన్న కేసులను ప్రస్తావించారు.ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం వైసీపీని అడ్డుపెట్టుకొని నాటకాలు ఆడుతోందని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీ, బిజెపిల తీరును గమనిస్తున్నారని బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. రాష్ర్ట ప్రజలను మోసం చేసిన పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు.
రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్న నేతలు గుజరాత్ రాష్ట్రంలో 75వేల కోట్లతో 80 వేల ఎకరాల్లో రాజధానిని ఎందుకు నిర్మించారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోందన్నారు.
ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పిన కేంద్రం కూడ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యలను కేంద్రానికి గవర్నర్ ఎందుకు నివేదిక ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.