గాడిదకేం తెలుసు గంధం వాసన .. మాజీ మంత్రి జవహర్ జగన్ గురించి తీవ్ర వ్యాఖ్యలు
విశాఖ మెడ్ టెక్ జోన్ పై ఏపీలో రచ్చ కొనసాగుతుంది. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ఉత్పత్తితో పాటు పంపిణీ కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయం రసకందాయంలో పడింది . ఇక ఇదంతా చంద్రబాబు ఘనతే అంటూ టీడీపీ, అదేమీ కాదు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రోత్సాహమే అంటూ వైసీపీ ప్రచారం ప్రారంభించేశాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మెడ్ టెక్ జోన్ కు అప్పట్లో అడ్డుపడింది వైసీపీనేనని టీడీపీ విమర్శలు చేస్తుంది. ఇక వైసీపీ కూడా దానికి రివర్స్ కౌంటర్ మొదలు పెట్టింది.
ఖమ్మం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు..మంత్రి ఆదేశాలు..అప్రమత్తమైన అధికారులు
ఇక ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుడు మాజీ మంత్రి జవహర్ ఏపీలో మెడ్ టెక్ సిటీని అభివృద్ధి చేసిన ఘనత నాటి సీఎం చంద్రబాబుదేనని పేర్కొన్నారు . ఏపీ సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలను చూస్తే 'గాడిదకు ఏం తెలుసు గంధం వాసన' అన్న సామెత గుర్తొస్తోందని మాజీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు . గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఫార్మాను అభివృద్ధి చేశామని, ఇక విభాజిత ఏపీలో అలాంటి వ్యవస్థ కోసం 270 ఎకరాలలో మెడ్టెక్ సిటీని అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు. ఇక గతంలో అలాంటి మెడ్ టెక్ను మయ సభ అంటూ జగన్ అభివర్ణించారని జవహర్ గుర్తు చేశారు.
ఇక వైసీపీలో బంచ్ ఆఫ్ జోకర్స్ చంద్రబాబును హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జవహర్, జగన్ వల్లనే మెడ్ సిటీ జోన్ వచ్చిందని గౌతమ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు . ఇక డా. సుధాకర్ విషయంలో ఆయనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు .తనకున్న హక్కులను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. తిట్టడం, కొట్టడం, దోచుకోవడం, ఎదురు దాడి చేయడం వైసీపీ నాయకులకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదని జవహర్ మండిపడ్డారు . చంద్రబాబు విజన్కు మెడ్ టెక్ జోన్ నిదర్శనమని కొనియాడారు. చంద్రబాబు విజనరీ నాయకుడని పేర్కొన్నారు .ముఖ్యమంత్రికి కరోనా వైరస్ నియంత్రణకు ఎలా పని చెయ్యాలో చేతగాక పోతే వెంటనే చంద్రబాబును ఆహ్వానించాలన్నారు. ఏది ఏమైనా ఏ చిన్న విషయం జరిగినా ప్రతి దానికి రాజకీయాలు చెయ్యటం ఏపీలో రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది .