'మోకా' హత్య కేసు... రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర...
వైసీపీ నేత,మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కర రావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి,టీడీపీ నేత కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కేసులో మిగతా నిందితులు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య (పులి), నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణతో పాటు మరో మైనర్ను కూడా ప్రత్యేక బందోబస్తు నడుమ మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను పోలీసులు మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. అయితే మచిలీపట్నంలోని సబ్ జైలులో సరైన సౌకర్యాలు లేనందున.. నిందితులను రిమాండ్ నిమిత్తం నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది కోరగా న్యాయస్థానం తిరస్కరించింది.
సోమవారం మరోసారి ఇదే విషయమై రవీంద్ర తరుపు న్యాయవాది సబ్ జైలర్కు లిఖితపూర్వకంగా విన్నవించారు. దీన్ని జిల్లా కోర్టుకు పంపించగా... న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అనుమతిచ్చారు. దీంతో సోమవారం సాయంత్రం ప్రత్యేక పోలీస్ బందోబస్తు నడుమ కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులను రాజమండ్రి తరలించారు.