అందుకే.. రూ.350 వెనక్కి: కేంద్రంపై హైకోర్టుకు, 'జగన్ కేసులో ఈడీ అటాచ్మెంట్ వెనక్కి ఎందుకు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ఏడు జిల్లాలకు మంజూరు చేసిన రూ.350 కోట్లను కేంద్రం తిరిగి వెనక్కి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
కేంద్రం తీరు దురుద్దేశ్యపూర్వకంగా ఉందని, విభజన చట్టంలోని 46(2), 46(3) సెక్షన్లకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను రాజకీయ కారణాలతో కేంద్రం తన ఇష్టానుసారం వెనక్కి తీసుకోవడానికి వీల్లేదన్నారు.
అందుకే రూ.350 కోట్ల నిధులు వెనక్కి
నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కొణతాల పేర్కొన్నారు. నాటి హామీ మేరకు హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఈ కారణంతోనే విడుదల చేసిన నిధులను వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. వాటిని తిరిగి ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలన్నారు.
నమ్మకద్రోహం చేసిన వారికి గుణపాఠం
'ధర్మపోరాటం.. ఇది ధర్మపోరాటం.. నమ్మక ద్రోహం చేసిన వారికి తప్పదు గుణపాఠం..' అంటూ సాగే కొత్త పాటను టీడీపీ విడుదల చేసింది. తిరుపతిలో జరిగే సభ నేపథ్యంలో 6.20 నిమిషాల నిడివితో 'నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం' పేరుతో రూపొందించిన పాటలో హోదా, విభజన అంశాలను ప్రస్తావించారు. ఇందులో కేంద్రం తీరుతో పాటు వైసీపీ రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట సీడీలను మంత్రి పత్తిపాటి పుల్లారావు శనివారం విజయవాడలో ఆవిష్కరించారు.
తిరుపతి సభలో ఎండగడతాం
కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ఈ పాటను విడుదల చేశామని పత్తిపాటి తెలిపారు. ఈ పాట ప్రజల్లో ఆగ్రహాగ్ని రగిలిస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను ఈ నెల 30న తిరుపతిలో జరిగే ధర్మపోరాట సభలో ఎండగడతామన్నారు.
ఈడీ అటాచ్మెంట్ వెనక్కి దేనికి సంకేతం?
ముఖ్యమంత్రి కేంద్రం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తనకు తానే ఊహించుకొని భయపడుతున్నాడన్న బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేత కళా వెంకట్రావు కౌంటర్ ఇచ్చారు. వైసీపీతో బీజేపీ కలిసిపోయిందన్నది అందరికీ తెలిసిందేనని అన్నారు. జగన్ కేసులో ఈడీ అటాచ్మెంట్లను వెనక్కి తీసుకోవడం దేనికి సంకేతమన్నారు. బీజేపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని, కంభంపాటి హరిబాబు వాస్తవాలను కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సొంత ఎంపీలను బెదిరించిన చరిత్ర
సొంత పార్టీ ఎంపీలనే కేసులతో బెదిరించిన చరిత్ర బీజేపీదని కళా వెంకట్రావు మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రాన్ని వైసీపీ ప్రశ్నించకపోవడం, బీజేపీ నాయకులు పదేపదే జగన్ను ఆకాశానికి ఎత్తేయడం లాలూచీ రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేంద్రంలో మంత్రి పదవులకు ఇద్దరు టీడీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఒక్కరోజులో ఆమోదం పొందితే వైసీపీ ఎంపీల రాజీనామాలు ఇప్పటివరకూ ఆమోదించలేదన్నారు.
కాగా, సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తనకు తానే ఊహించుకొని భయపడుతున్నారని,ప్రజలే రక్షణ కల్పిస్తారని ముఖ్యమంత్రి ప్రకటించడం, తరచుగా కేసుల విషయం ప్రస్తావించడం చేస్తున్నారని, వైసీపీ-బీజేపీ కలిసి పోవాలని ప్రయత్నిస్తున్నాయని మాట్లాడం సరికాదని హరిబాబు అన్న విషయం తెలిసిందే. అసలు ఎన్నికల వ్యూహంపై మాట్లాడనే లేదన్నారు. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలన టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.