ప్రాణం పోయినా: కోట్ల, హైద్రాబాద్ ఉండగా: రఘువీరా
కర్నూలు: తాను ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెసు పార్టీని వీడేది లేదని, ప్రాణం పోయినా పార్టీని మారనని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి శనివారం కర్నూలు జిల్లాలో అన్నారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలన్నీ గిట్టనివారు పుట్టించినవేనన్నారు.
కర్నూలులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి 95వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. పదవుల పట్ల తనకు మక్కువ లేదని చెప్పారు. అలాంటప్పుడు అధికారం కోసం పాకులాడాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు.
అవినీతి ఆరోపణలు ఉన్న వారు మాత్రమే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతారన్నారు. ఎన్నికల్లో ప్రజలు తనను ఓడించారని, అయినా ఏమాత్రం సంయమనం కోల్పోవద్దన్నారు. తనకెంతో ఇష్టమైన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యానని చెప్పారు.
ఎపి పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... కోట్ల కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విడదీయ రాని బంధం ఉందన్నారు. నేటి రాజకీయాల్లో కోట్ల లాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారన్నారు. ఆయన తండ్రి దివంగత కోట్ల విజయ భాస్కర రెడ్డి మాదిరిగానే నిజాయితీగా నలుగురికి ఉపయోగపడే విధంగా పని చేశారే తప్ప అవినీతితో కోట్లు వెనుకేసుకోవాలన్న కోరిక లేని కుటుంబమన్నారు.
మరోవైపు, రాజధాని పైన రఘువీరా మాట్లాడుతూ.. రాజధాని ఏర్పాటు పారదర్శకంగా జరగాలన్నారు. ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. హైదరాబాదు విషయంలో జరిగిన తప్పిదం మరోసారి జరగకుండా చూడాలన్నారు. హైదరాబాద్ తాత్కాలిక రాజధాని ఉండగా.. మళ్లీ విజయవాడ తాత్కాలిక రాజధాని ఏమిటని ప్రశ్నించారు.