కాంగ్రెస్కు షాక్: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి మహీధర్
తూర్పుగోదావరి: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో బుధవారం జరిగిన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న మహిధర్ రెడ్డి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చిన మహిధర్ రెడ్డిని వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉందని అన్నారు.
రాష్ట్రంలో మార్పును, జగన్ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. వైయస్సార్ ఆశయాలను నెరవేరుస్తానంటున్న జగన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మహిధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కాకుండా తన అభివృద్ధినే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు.