మా బాలా మావయ్య చాలా మంచోడు: తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగింది మీరే! లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి ఎదిగారంటూ వైఎస్ జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారని ఘాటుగా విమర్శించారు. తన మామయ్య నందమూరి బాలకృష్ణ నీతి, నిజాయితీతో ఎదిగారని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వైఎస్ జగన్కు వ్యతిరేకంగా వరుసగా ట్వీట్లను సంధించారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు, ఆయన సహచర మంత్రులపై ఘాటు విమర్శలు చేశారు లోకేష్. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి బ్రాండ్నేమ్కు చెడ్డపేరు తీసుకుని రావడానికి కుట్ర పన్నారని, ఇందులో భాగంగా- ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
వైఎస్ఆర్ సీపీ నేతలది ఫేక్ బతుకు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ రాజధాని అమరావతి ప్రాంతంలో 500 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, పెద్ద ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ చోటు చేసుకుందని అంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విలేకరుల సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబందించి- ఓ ఆంగ్ల దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ క్లిప్ను తన ట్వీట్లకు జోడించారు నారా లోకేష్. ఈ క్లిప్పింగ్ను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రిపై ఎదురుదాడికి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నారని లోకేష్ విమర్శించారు. వాళ్ల ఫేక్ బతుకు ఇంకా మారలేదని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారని ఆరోపించారు.
అమరావతి బ్రాండ్ దెబ్బతీయడానికే..
ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని, శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఏ రోజు కూడా అధికారం వైపు, పెత్తనాన్ని చలాయించడం వైపు బాలకృష్ణ చూడలేదని చెప్పారు. `స్వచ్ఛమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య..`అని బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ తండ్రి ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పటికీ.. ఏనాడూ దాన్ని దుర్వినియోగం చేయలేదని అన్నారు.నీతి, నిజాయితీతో రాజకీయాలు చేస్తోన్న బాలకృష్ణ రాజధానిలో భూములు కొన్నారని ఆరోపించడంలో అర్థం లేదని అన్నారు. ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్కు, ఆయన మంత్రులకు పరిపాలన చేతకావట్లేదని, అందుకే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
గుట్టు చప్పుడు కాకుండా 500 ఎకరాలు..
రాష్ట్ర రాజధానిగా అమరాతిని ప్రకటించడానికి ముందే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ, అతని బంధువు అమరాతిలో 500 ఎకరాల భూమిని కొనుగోలు చేశారంటూ బొత్స సత్యనారాయణ ఆరోపించిన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, సన్నిహితులకు ప్రయోజనం కలిగించడానికే అమరావతి ప్రాంతాన్ని గుంటూరు-విజయవాడ మధ్య ప్రకటించారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన అంతర్గత వ్యాపారానికి (ఇన్సైడ్ ట్రేడింగ్)కు సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు.
నాడు హైటెక్ సిటీ..నేడు అమరావతి
ల్యాండ్ పూలింగ్ పథకం పేరిట రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. ప్రపంచబ్యాంక్ కూడా అమరాతికి రుణం ఇచ్చేందుకు వెనక్కి తగ్గడానికి భూ సేకరణలో జరిగిన అవకతవకలే కారణని చెప్పారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణానికి ముందే అక్కడి భూములను మురళీమోహన్కు చెందిన జయభేరి గ్రూప్ సంస్థల ద్వారా కొనుగోలు చేయించారని, అదే తరహా దోపిడీని అమరావతిలోనూ చేపట్టారని బొత్స అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు బినామీలే అమరావతిలో 500 ఎకరాలను నామమాత్రపు ధరకు కొనుగోలు చేశారని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు.