నాటి క్లీన్ అండ్ గ్రీన్..నేటి స్వచ్ఛభారత్: ఇండియా ఎకనమిక్ సమ్మిట్ లో నారా లోకేష్: గతానికి భిన్నంగా!
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఐటీ శాఖ మాజీ మంత్రి నారా లోకేష్.. చాలాకాలం తరువాత తెర మీదికి కనిపించారు. ఇన్నాళ్లు ట్విట్టర్ కే పరిమితమైన ఆయన ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరయ్యారు. ఇండియా ఎకనమిక్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఏటేటా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏర్పాటయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు అనుబంధంగా ఈ సమ్మిట్ ను నిర్వహించారు. డేటా వినియోగం, ఆర్థిక నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై నారా లోకేష్ ఇందులో ప్రసంగించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ, ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై ఆయన సూచనలు చేశారు. ఇదివరకు మంత్రి హోదాలో దావోస్ సదస్సులో పాల్గొన్నారు నారా లోకేష్. యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ సారి దీనికి భిన్నంగా ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. డేటా వినియోగంపై నారా లోకేష్ ఎక్కువగా ఫోకస్ చేశారు.
డేటా వినియోగం భారత దేశ ఆర్థిక వ్యవస్థను సూచిస్తుందని అభిప్రాయపడ్డారు. డేటా లభ్యత, వినియోగం, ఆవిష్కరణ, నిర్వహణ మధ్య సమతౌల్యతను భారత్ సాధించిందని, దీన్ని మరింత పటిష్ట పరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజల ఆరోగ్యపరమైన డేటాను ఆధారంగా చేసుకుని వైద్య పరిశోధనలను సరికత్త ఆవిష్కరణకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచడానికి దీనికి సంబంధించిన డేటా ఉపయోగపడుతుందని వెల్లడించారు.
డేటా స్టోరేజీ, దాన్ని భద్రపరచడం అత్యంత కీలకమైన అంశాలని, ఇందులో ఏ మాత్రం పొరపాట్లు చోటు చేసుకున్నా చేదు ఫలితాలు ఎదురవుతాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రకటించిన తరువాత పారిశుద్ద్యం మెరుగు పడిందని, గతంలో తమ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను నిర్వహించిందని గుర్తు చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు.