అబద్ధాల శాఖకు బొత్సా మంత్రి .. నాడు జగన్ ను తిట్టిన నోటితోనే నేడిలా : మాజీ మంత్రి చినరాజప్ప కౌంటర్
ఏపీలో ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో టీడీపీ నేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు ని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి బొత్సా సత్యన్నారాయణ తాజాగా స్పందించారు. ఈఎస్ఐ కుంభకోణంలో జరిగిన అవినీతిలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లకు వాటా ఉందని అందుకే అసలు విషయం పక్కన పెట్టి అచ్చెన్నాయుడు అరెస్టు అన్యాయమని రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఇక మంత్రి బొత్సా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప .
రాజధాని విషయంలో మాట్లాడి అభాసుపాలయ్యావ్ చాల్లేదా ?
బొత్సా సత్యన్నారాయణ నోరు తెరిస్తే అబద్ధం అని వ్యాఖ్యానించారు. అచ్చెన్న అరెస్ట్ విషయంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదని ఆయన ఫైర్ అయ్యారు . ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై గతంలో అబద్ధాలాడి మంత్రి బొత్స సత్యనారాయణ అభాసుపాలయ్యారని, ఆయన అబద్ధాల శాఖకు మంత్రి అని ఘాటుగా వ్యాఖ్యానించారు నిమ్మకాయల చినరాజప్ప.
వోక్స్ వేగన్కి రూ.10 కోట్లు కట్టబెట్టిన బొత్సని ఎందుకు అరెస్ట్ చెయ్యొద్దు ?
ఇక బొత్సాకు మాట మార్చటం, అబద్ధాలు చెప్పటం అలవాటని ఆయన పేర్కొన్నారు . ఇప్పుడు అచ్చెన్నాయుడుపై కూడా అదేవిధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. కేవలం సిఫారసు లేఖతోనే అవినీతి అంటే ఇక బొత్సా నాడు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వాటిని ఏమనాలి అని ప్రశ్నించారు. సిఫారసు లేఖ ఇచ్చినందుకే అచ్చెన్నను అరెస్ట్ చేస్తే వోక్స్ వేగన్కి రూ.10 కోట్లు కట్టబెట్టిన బొత్సని ఎందుకు అరెస్ట్ చేయకూడదని టీడీపీ నేత మాజీ మంత్రి చినరాజప్ప ప్రభుత్వాన్ని నిలదీశారు .
Recommended Video
నాడు జగన్ ని తిట్టిన నోటితోనే నేడు పొగడ్తలు .. ప్రాపకం కోసమేనా ?
ఇక గతంలో సీఎం జగన్ గురించి, ఆయన తల్లి విజయమ్మ గురించి బొత్స నానా మాటలు అన్నారని గుర్తు చేసిన చినరాజప్ప ఇప్పుడు భజన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రాపకం కోసమే బొత్సా పాకులాట అని , అందుకే అన్నీ అబద్ధపు వ్యాఖ్యలే చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు . బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తే బొత్స కనీసం నోరు మెదపలేదన్న ఆయన బోత్సాకు బీసీల మీద ఉన్న ప్రేమ అందులోనే కనిపిస్తుంది అని పేర్కొన్నారు .