జగనన్న వచ్చారని వరుణుడు పారిపోయాడహో: లక్ష కోట్లు వెనకేసుకున్నా అక్రమ సంపాదనేనా? నారా లోకేష్!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చినుకు కరవైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ విమర్శించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వచ్చారనే ఉద్దేశంతో వరుణ దేవుడు పారిపోయినట్టు ఉన్నాడని ఆరోపించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లను సంధించారు. మంచినీరు దొరక్క ప్రజలు రోడ్డెక్కుతున్నారని, వ్యవసాయానికి చాలినంత నీటి లభ్యత లేకపోవడం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అల్లాడుతున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ- వరుణ దేవుడు తమ పార్టీలో చేరాడంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
వరుణుడు పక్కరాష్ట్రానికి పారిపోయాడా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి సీజన్ లోనే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చినుకు కరవైందని నారా లోకేష్ అన్నారు. వరుణుడు ఏమయ్యాడని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా? అని నిలదీశారు. తన ప్రశ్నలకు వైఎస్ఆర్సీపీ మేధావులు మాత్రమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు గొప్పలు చెబుతున్నారని, జగనన్న భగీరధుడు అంటూ బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ మూడు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైందని అన్నారు. 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని అన్నారు. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరివ్వమంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారని చెప్పారు.
ప్రజల కన్నీటి చుక్కలే..జగన్ అక్రమాస్తులు
ప్రజల కన్నీటి చుక్కలతోనే వైఎస్ జగన్ అక్రమాస్తులు బలపడుతున్నాయని లోకేష్ అన్నారు. ప్రజల కన్నీటి చుక్కల తడి తగిలితేనే గానీ వైఎస్ జగన్ అక్రమాస్తుల కోటల పునాదులు బలంగా ఉండవని అన్నారు. లక్షకోట్ల క్విడ్ ప్రో కో కేసుల్లో ముఖ్యమంత్రి మునిగి తేలుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయలను వెనకేసుకున్నప్పటికీ.. అక్రమ సంపాదనపై ఇంకా మోజు తీరలేదని అన్నారు. సిమెంట్ కంపెనీల నుంచి జే-ట్యాక్స్ ను వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. జే-ట్యాక్స్ వసూళ్లు పూర్తయ్యేవరకు ఇసుక సమస్య తీరదని నారా లోకేష్ జోస్యం చెప్పారు. అప్పటివరకు భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక, ఆకలితో ఉండలేక అప్పులపాలు కావాల్సిందేనా అని నిలదీశారు.
సంపూర్ణ మద్యనిషేధం ఓ భారీ కుంభకోణం..
సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో ముఖ్యమంత్రి అతిపెద్ద కుంభకోణానికి తెర తీశారని విమర్శించారు నారా లోకేష్. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాల్లో తమ బ్రాండ్ ఉండాలంటే మళ్లీ జే-టాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. తమ సంస్థ బ్రాండ్ల మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో ఏర్పాటు విక్రయానికి ఉంచడానికి జే-ట్యాక్స్ కట్టాల్సిందేనని లోటస్ పాండ్ ఇంటి నుంచి లిక్కర్ కంపెనీలకు ఫోన్లు చేసి, బెదిరిస్తున్నారని ఆరోపించారు. పైగా మద్యనిషేధం అక్కచెల్లెళ్ల సంక్షేమం కోసమేనంటూ బిల్డప్ ఇస్తున్నారని అన్నారు.