వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ: రాష్ట్రంలో ఇదే మొదటిది
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహం జిల్లాలోని పులివెందుల తాలూకాలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు. పులివెందుల తాలూకాలోని సింహాద్రిపురంలో స్థానికులు ఈ నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన తరువాత- ఆయన విగ్రహం ఏర్పాటు కావడం రాష్ట్రంలో ఇదే మొదటిది. నిజానికి వైఎస్ వివేకా జయంతి రోజైన ఈ నెల 8వ తేదీ నాడే పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉండగా.. అది వాయిదా పడిన విషయం తెలిసిందే.
వైఎస్ జగన్.. న్యూఢిల్లీ పర్యటనలో ఉండటం, సకాలంలో జిల్లాకు రాలేకపోవడం వల్ల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేశారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై నెలకొన్న మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ హత్యకేసులో నలుగురిని ప్రధాన నిందితులుగా గుర్తించారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు. వైఎస్ వివేకా వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ఆయన సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలను అరెస్టు చేశారు. వారిపై విచారణ కొనసాగుతోంది. వైఎస్ వివేకా హత్యకు గల కారణాలేవీ ఇంత వరకూ స్పష్టంగా వెలికి రాలేదు. ఆర్థిక పరమైన అంశాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల వల్లే ఈ నలుగురు వైఎస్ వివేకాను హత్య చేయడానికి కుట్ర పన్ని ఉంటారని చెబుతున్నారు.
ఈ నలుగురిలో ప్రతాప్ రెడ్డి, పరమేశ్వర రెడ్డిలే ప్రత్యక్షంగా హత్యోదంతంలో పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వారిపై ఇదివరకే నార్కో అనాలసిస్ పరీక్షలను సైతం నిర్వహించారు.వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్కు కోర్టు అనుమతిచ్చింది. వివేకా హత్యకేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారని అభియోగం ఉంది. ఇప్పటికే వైఎస్ వివేకా హత్యోదంతంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇంటి వాచ్మెన్ రంగయ్య, శేఖర్ రెడ్డికి నార్కో టెస్ట్లను నిర్వహించారు పోలీసులు.
ఇదివరకు వారికి నార్కో పరీక్షలు చేయాలన్న సిట్ విఙ్ఞప్తిని గతంలో పులివెందుల కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోర్టు నార్కో పరీక్షలకు ఓకే చెప్పింది. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై మార్చి 28న పోలీసులు వారిని అరెస్ట్ చేయగా ఇన్నిరోజులుగా నిందితులు రిమాండ్లో ఉన్నారు.