పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీకి షాక్ .. మాజీ మంత్రి పడాల అరుణ రాజీనామా
ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది . మాజీ మంత్రిగా పని చేసిన నేత, విజయనగరం జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకురాలు పడాల అరుణ టీడీపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. గత 33 ఏళ్లుగా టీడీపీ లోనే ఉంటూ వచ్చిన ఆమె పార్టీలో కీలకంగా వ్యవహరించారు.
టిడిపి నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ కీలకంగా పని చేశారు.
ఇటీవల పార్టీలో వస్తున్న మార్పులు, సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం వంటి పరిణామాలు, తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్న ఆవేదన వెరసి ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. 33 ఏళ్లుగా టిడిపిలో పనిచేసినా తనను పావుగా వాడుకున్నారు తప్ప, తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని పడాల అరుణ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా పని చేసిన తనకు అటు అధిష్ఠానం, ఇటు జిల్లా పార్టీ పెద్దలు కనీసం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె తీవ్ర అసహనంతో ఉన్నారు .
రాష్ట్ర కమిటీలో సైతం చోటు కల్పించలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న పడాల అరుణ చంద్రబాబు కి షాక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఒకపక్క పంచాయతీ ఎన్నికలలో వైసిపి ఓడించాలని, టిడిపి సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు, విజయనగరం జిల్లా సీనియర్ నాయకురాలు పడాల అరుణ రాజీనామా చేయడం, విజయనగరం జిల్లాలో టిడిపికి గట్టి దెబ్బే అని చెప్పాలి.