కాబోయే ముఖ్యమంత్రి లోకేష్, కేంద్రానికి చంద్రబాబు: పీతల సంచలన వ్యాఖ్యలు
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామదర్శిని సభలో ఆమె మాట్లాడుతూ.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ వ్యాఖ్యానించారు.
అంతేగాక, ఏపీ, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో కేంద్రానికి వెళ్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పీతల సుజాత వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పితాని సత్యనారాయణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు పెనుగొండ గ్రామదర్శిని సభలో మంత్రి నారా లోకేష్కు మహిళల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పితాని సత్యనారాయణ సమక్షంలోనే మహిళలు సమస్యలపై మొరపెట్టుకున్నారు.
తమకు ఇళ్లు, మరుగుదొడ్లు లేవని, ఇళ్ల స్థలాలు ఇప్పించండంటూ మహిళలు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చారు. పితాని సమక్షంలోనే భారీగా ఫిర్యాదులు రావడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకోవడంతో మంత్రి లోకేష్, ఇన్ని సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు.