ఈఎస్ఐ స్కామ్లో మరో బిగ్ ఫిష్: మాజీమంత్రి పితాని సత్యనారాయణ మెడకు: ఏసీబీ వలలో మాజీ పీఎస్
అమరావతి: కోట్ల రూపాయల మేర అవినీతి చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న ఈఎస్ఐ కుంభకోణం.. మరో మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ సభాపక్ష ఉప నేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి సహా పలువురు అధికారులు అరెస్టు అయ్యారు. తాజాగా- అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో బిగ్ ఫిష్ పడింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పితాని సత్యనారాయణ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మురళీ మోహన్ను ఏసీబీ అధికారులు కొద్దిసేపటి కిందట అరెస్టు చేశారు.
టీడీపీలో మరో వికెట్! గుడ్ బై చెప్పనున్న పితాని: వైఎస్ఆర్ సీపీలో కర్చీఫ్ వేసినట్టే?
ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారం తనదాకా వచ్చే అవకాశాలు లేకపోలేదంటూ మురళీమోహన్ ముందుగానే ఊహించినట్టుంది. అందుకే ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలంటూ గురువారం నాడే హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ను దాఖలు చేసిన మరుసటి రోజే ఆయనను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో మురళీ మోహన్ అరెస్టు కావడంతో.. ఇక పితాని సురేష్కు కూడా బేడీలు పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు మాత్రమే కాదు..మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర కూడా ఉన్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. వాటిని ఆయన తోసిపుచ్చారు. 2017లో ఆయన కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. తాను గానీ, తన కుమారుడి ప్రమేయం గానీ ఈ కుంభకోణంలో లేదంటూ స్పష్టం చేశారు. ఆయన హయాంలో ఈఎస్ఐ డైరెక్టర్లుగా పనిచేసిన అధికారులు ప్రస్తుతం అరెస్టు అయ్యారు. విచారణలో ఉన్నారు. తాజాగా మురళీ మోహన్ అరెస్టు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక పితాని సురేష్ను కూడా అదుపులోకి తీసుకోవడం ఖాయమనే సంకేతాలను ఇచ్చినట్టయింది. తండ్రి కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సురేష్ ఆ శాఖలో చక్రం తిప్పాడనే ఆరోపణలు ఉన్నాయి. అచ్చెన్నాయుడితో కలిసి ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడి ఉండొచ్చని అంటున్నారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం, హైకోర్టును ఆశ్రయించడం వంటి చర్యల వల్ల ఆయన పాత్రపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మురళీ మోహన్ అరెస్టు తరువాత.. ఇక పితాని సురేష్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు.