రాజ్యసభ షాక్, బాబుపై పుష్పరాజ్ సంచలనం: 'నన్ను గదిలో పెట్టి రాజకీయం'
విజయవాడ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పుష్పరాజ్ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యసభ సీటును కేటాయించనందుకు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను గదిలో బందించి రాజకీయం చేశారని ఆరోపించారు. తనను మోసం చేశారని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పటిలా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. పదవుల విషయంలో తనను ప్రతిసారి బాధపెడుతున్నారని చెప్పారు.
ఇప్పుడు టిడిపిలో నీతి, నిజాయితీలకు కాలం చెల్లిందన్నారు. తనకు రాజ్యసభ సీటును ఇస్తానని చెప్పి మాట తప్పారన్నారు. అయితే, ఆయన ఎక్కడా చంద్రబాబు పేరును ప్రస్తావించలేదు. పరోక్షంగా చురకలు అంటించారు. ఆయన వ్యాఖ్యలపై టిడిపిలో చర్చ సాగుతోంది.
కాగా, పుష్పరాజ్ను బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగారు. అలిగిన ఆయనను బుజ్జగించేందుకు మంత్రులు రావెల కిషోర్ బాబు, యనమల రామకృష్ణలను పంపినట్లుగా తెలుస్తోంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో సుజనను, టీజీని ఎంపిక చేయాల్సి వచ్చిందని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని వారు సూచించారని తెలుస్తోంది.
హోదా వస్తుంది: కావూరి
ఏపీకి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివ రావు మంగళవారం నాడు చెప్పారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఏపీ నుంచి నామినేషన్ వేయడం సంతోషకరమన్నారు. వచ్చే బడ్జెట్లో రైల్వే జోన్ ప్రకటిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. సురేష్ ప్రభు ఆంధ్రాకు న్యాయం చేస్తారన్నారు.
రాజ్యసభ నామినేషన్ ఇలా...
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజ్యసభ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా సురేశ్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి మాణిక్యాల రావు, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ఎంపీ గోకరాజు రంగరాజు, భాజపా నేత కావూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ నుంచి తెదేపా రాజ్యసభ అభ్యర్థులుగా సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళుర్పించిన అనంతరం ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి అంజలి ఘటించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి ర్యాలీగా చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరయ్యారు. టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.