వర్ల.. దురహంకారాన్ని తగ్గించుకో!, తక్షణం క్షమాపణ చెప్పు: మాజీ మంత్రి రావెల
గుంటూరు: దళిత ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. దాని వల్ల దళిత జాతిలో అభద్రతా భావం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం ఏంటని ప్రశ్నించారు రావెల. ఇక ఓ మాదిగ విద్యార్థి పట్ల దురుసుగా వ్యవహరించిన ఆర్టీసి ఛైర్మన్ వర్ల రామయ్యపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. వర్ల రామయ్య వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, వర్ల దురహంకారాన్ని తగ్గించుకోవాలని హెచ్చరించారు.
వర్ల తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని రావెల డిమాండ్ చేశారు. మాదిగలంతా దీనిపై ఉద్యమానికి సిద్దం కాకముందే వర్ల తన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన హితవు పలికారు. జిల్లాలో అధికారులు తన మాట వినడం లేదని, వారి ఏకపక్ష పోకడలపై త్వరలోనే సీఎంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి దళితులను అక్కున చేర్చుకుంటే.. నేడు వారిపైనే దాడులు జరుగుతుండటం సరైందని కాదని అన్నారు.