వైఎస్ఆర్ సీపీలోచేరిన మంత్రి సోమిరెడ్డి సోదరుడుః మొన్న బావ..నేడు తమ్ముడు
నెల్లూరుః నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అటు మంత్రి పదవికి, ఇటు శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆదివారం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి చెందిన సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకొన్నారు. ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో కలకల సృష్టించింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇది ఊహించని విఘాతమేనని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
కొద్దిరోజుల కిందటే సోమిరెడ్డి బావ రామకోట సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇలా సొంత కుటుంబం నుంచే ఇద్దరు కీలక వ్యక్తులు, నాయకులు ప్రతిపక్ష పార్టీకి వలస వెళ్లడం సోమిరెడ్డికి మింగుడు పడని విషయం.
సర్వేపల్లి ఖాళీ..
చంద్రమోహన్ రెడ్డి వైఖరి నచ్చకపోవడం వల్లే సుధాకర్ రెడ్డి ప్రతిపక్షపార్టీలో చేరారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి, అక్రమాల కారణంగా సొంత కుటుంబ సభ్యులతో పాటు, కీలక నాయకులు తమ పార్టీలోకి చేరుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇంకా చాలామంది తెలుగుదేశం నేతలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని అన్నారు. వారంతా త్వరలోనే తమ పార్టీలో చేరుతారని అన్నారు. త్వరలనే సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. సర్వేపల్లి మండల స్థాయి టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తమ పార్టీలో చేరబోతున్నారని అన్నారు. టీడీపీ ఓటమికి ఇది నాంది అవుతుందని అన్నారు. జిల్లాలో మరోసారి తము అత్యధిక సీట్లను గెలుచుకుంటామని కాకాణి ధీమా వ్యక్తం చేశారు.
మూడుసార్లు ఓడినా మంత్రి పదవి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడనే పేరుంది. 1999లో చివరిసారిగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన 2004, 2009, 2014 ఎన్నికల్లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయనపై సుమారు అయిదు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అయినప్పటికీ.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, తరచూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ప్రెస్మీట్లు నిర్వహిస్తుండటం వంటి చర్యల వల్ల చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. శాసన మండలికి పంపించి, మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సోమిరెడ్డి.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సర్వేపల్లి అసెంబ్లీ బరి నుంచి పోటీ చేయడానికి సన్నద్ధులయ్యారు. నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తన సొంత సోదరుడు సుధాకర్ రెడ్డి పార్టీని వీడటం, ప్రత్యర్థి పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. చంద్రమోహన్ రెడ్డి గెలుపుపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు.