మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ తుదిశ్వాస విడిచారు.
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో వట్టి సుదీర్ఘ కాలం పని చేసారు. వైఎస్ కు సన్నిహితుడుగా ఉండేవారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించారు. కొంత కాలంగా ఆయన విశాఖలో నివాసం ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వట్టి వసంత కుమార్ 2004,2009 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వట్టి వసంత్కుమార్ స్వస్థలం ప.గో.జిల్లా పూండ్ల.వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేత. వైఎస్ కేబినెట్ లో 2009లో మంత్రిగా వ్యవహరించారు. ఆ తరువాత రోశయ్య..కిరణ్ కుమార రెడ్డి కేబినెట్ లోనూ మంత్రిగా పని చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కినా..పోర్టుఫోలియో కేటాయింపు సమయంలో వట్టి వార్తల్లో నిలిచారు. ఆ తరువాత కిరణ్ కు మద్దతుగా వ్యవహరించారు. ఈ మధ్య కాలంలో జరిగిన కాపు సమావేశాల్లోనూ వట్టి హాజరయ్యారు. కిరణ్ కేబినెట్ లో టూరిజం శాఖా మంత్రిగా వట్టి బాధ్యతలు నిర్వహించారు.
మూడేళ్ల క్రితం వసంతకుమార్ సతీమణి కన్నుమూసారు. పిల్లలు లేకపోవటంతో బంధువుల నుంచి ఒకరిని దత్తత తీసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో వట్టి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 లో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా.. క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన వట్టి వసంతకుమార్ భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు.