బిజెపికి కాటసాని షాక్: పార్టీ మారడంపై రెండు రోజుల్లో ప్రకటిస్తా, వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండే పోటీ
కర్నూల్: బిజెపిని వీడే విషయాన్ని రెండు రోజుల తర్వాత వెల్లడించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ నుండి బరిలోకి దిగనున్నట్టు ఆయన ప్రకటించారు.
బిజెపికి గుడ్బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
అనుచరులతో ఏప్రిల్ 18న కాటసాని సమావేశం, బిజెపికి షాకిస్తారా?
రాష్ట్రంలో, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన తన అనుచరులతో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ మారాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
రెండు రోజుల్లో ప్రకటిస్తా
బిజెపికి గుడ్ బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి భావిస్తున్నారు. బుధవారం నాడు అనుచరులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపిని వీడే విషయమై రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు తేల్చి చెప్పారు. పార్టీ మారాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు.
వైసీపీలో చేరుతారా
బిజెపికి గుడ్బై చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. బుధవారం నాడు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కూడ మెజారిటీ కార్యకర్తలు వైసీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్టుగా ఆయన చెప్పారు.అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాటసారి రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు.
పాణ్యం నుండే పోటీ చేస్తా
గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పాణ్యం నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఈ స్థానం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గౌరు సుచరితా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండి పోటీ చేస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే వైసీపీ నుండి వచ్చే ఎన్నికల్లో కాటసానికి టిక్కెట్టు ఇస్తారా అనే చర్చ సాగుతోంది, ఒకవేళ కాటసానికి రాంభూపాల్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తే గౌరు చరితారెడ్డి ఏ స్థానం నుండి బరిలోకి దిగుతోందనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి మాత్రం బిజెపిని వీడడం ఖాయంగా కన్పిస్తోంది.
కాటసాని ప్రకటనపై చర్చ
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రకటనపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ సాగుతోంది. వైసీపీలో చేరాలని తన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రకటించారు. అంతేకాదు పాణ్యం నుండే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనలు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. త్వరలోనే కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.