జగన్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు, టెక్కీ సౌజన్య కూడా
పశ్చిమగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు ఆ పార్టీలో చేరారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో శంబంగి వైసీపీలో చేరారు.
బొబ్బిలి నియోజకవర్గం నుంచి 1983,1985,1994 సంవత్సరాలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1994 లో టిడిపి విప్గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు.
ప్రస్తుతం ఏఐసీసీ మెంబర్గా కొనసాగుతున్న అప్పలనాయుడు కాంగ్రెస్ వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పలనాయుడికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైయస్ జగన్. కాగా, బొబ్బిలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌజన్య కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి సాంబశివరాజు, విజయనగరం కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదా రామారావు తదితరులు ఉన్నారు.