చంద్రబాబు, లోకేష్ అవినీతిపై విచారణ జరపాలి; తప్పుచేయకుంటే భయమెందుకు?:కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య
కడప:రాష్ట్రంలో సిఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తో సహా టిడిపి నేతలు గత నాలుగేళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేశారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. కడప లోస్థానిక ఇందిరాభవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి.రామచంద్రయ్య మాట్లాడారు.
పోలవరం, పట్టిసీమ, ఇసుక, మట్టి, విద్యుత్, మద్యం, ఎర్రచందనం ఇలా పలు అంశాల్లో అనేక విధాలుగా స్వయంగా చంద్రబాబు, లోకేష్ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అవినీతిని ప్రశ్నించడం, సోదాలు చేయడం తప్పుకాదని...అయినా తప్పుచేయకుంటే దర్యాప్తు చేస్తే భయమెందుకని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. ఈ అవినీతికి సంబంధించి చంద్రబాబు,లోకేష్ లను విచారించాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
తప్పుచేయనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ విచారణ ఎదుర్కొని తీరాలని...భయమెందుకని అన్నారు. అధికారపార్టీ నేతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని...కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేనే లేదని రామచంద్రయ్య దుయ్యబట్టారు. చంద్రబాబు తన సమస్యలను ప్రజలపై రుద్దుతూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశాడన్నారు.
ముఖ్యమంత్రి గారూ...ఓటుకు నోటు కేసులో వాయిస్ మీది కాదా, ప్రధాన సూత్రదారి మీరు కాదా అని చంద్రబాబును రామచంద్రయ్య నిలదీశారు. గడచిన నాలుగుగేళ్లుగా టిడిపి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిలేదని...ఇప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మోడీని దించుతానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నాడని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రతి పనిలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని రామచంద్రయ్య పునరుద్ఘాటించారు. అవినీతిపరులకు, పన్ను ఎగవేతదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా ఉన్నారని...ఇది నిజం కాదా అని మాజీ ఎంపి రామచంద్రయ్య ప్రశ్నించారు.