అలా చేరారు..ఇలా బయటికి వచ్చేశారు: టీడీపీ కండువాను విసిరికొట్టిన మాజీ ఎంపీ
Recommended Video
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ లోక్ సభ సభ్యుడు జీవీ హర్షకుమార్.. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకొన్న హర్షకుమార్.. నాలుగు రోజుల వ్యవధిలో అదే కండువాను విసిరి కొట్టారు. పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. టీడీపీ కండువా బరువుగా అనిపించిందని, ఆ భారాన్ని తాను మోయలేనని ఆయన రాజీనామా పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి గతంలో రెండుసార్లు ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు ఆ స్థానం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన అమలాపురం నుంచే జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, దారుణంగా పరాజయం పాలయ్యారు. ఏకంగా నాలుగోస్థానంలో నిలిచారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా లేరు.
టార్గెట్ జగన్ వయా జనసేన, జేడీ? చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో మరోసారి అమలాపురం లోక్ సభ నుంచే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ కోసం తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకొన్నారు. దీనికోసం ఏకంగా ఓ భారీ బహిరంగ సభనే నిర్వహించారు. ఈ నెల 19న ఆయన టీడీపీలో చేరగా.. మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా వెలువడింది. ఇందులో ఆయనకు చోటు దక్కలేదు. అమలాపురం లోక్ సభ సీటును చంద్రబాబునాయుడు లోక్ సభ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ కు కేటాయించారు. అంతే! ఇక టీడీపీలో ఇమడలేకపోయారు. టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎస్సీలను మోసం చేసిందని దుయ్యబట్టారు. గురువారం సాయంత్రం తన అనుచరులతో రాజమహేంద్రవరంలో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా తాను మెడలో వేసుకున్న టీడీపీ కండువాను విసిరి కొట్టారు. పసుపురంగు కండువా తనకు బరువుగా ఉందని, ఆ భారాన్ని తాను మోయలేనని వ్యాఖ్యానించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దళితులకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే టీడీపీలో చేరానని, ఆ పార్టీ కూడా మోసం చేసిందని హర్షకుమార్ ఆరోపించారు. అందుకే తాను టీడీపీ కండువా తీసేస్తున్నానని తెలిపారు.
జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ పైనా హర్షకుమార్ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంలో చేరిన తరువాతే- జనసేన పార్టీ ఏమిటో తనకు తెలిసి వచ్చిందని అన్నారు. టీడీపీ-జనసేన పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని అన్నారు. ఓరకంగా చెప్పాలంటే జనసేన పార్టీకి చంద్రబాబు మార్గదర్శనం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన రెండూ ఒక్కటేనని, పవన్ కల్యాణ్కు దమ్ముంటే తెలుగుదేశంతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ టికెట్లను టీడీపీ ఫిక్స్ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీకి ఓటేస్తే టీఆర్ఎస్, బీజేపీలకు వేసినట్లేనని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత తాను సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి ఎస్సీల కోసం పోరాడతానని హర్షకుమార్ ఉద్ఘాటించారు.