ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేస్తాం!: ప్రభుత్వానికి హర్షకుమార్ హెచ్చరిక
రాజమహేంద్రవరం: తమ డిమాండును పట్టించుకోకుంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాలను కూల్చివేస్తామని మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ బుధవారం నాడు రాజమహేంద్రవరంలో హెచ్చరించారు.
రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద హర్షకుమార్, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల తొలగించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలను రెండు వారాల్లో ఏర్పాటు చేయాలని హర్షకుమార్ అన్నారు. లేదంటే ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేస్తామని హెచ్చరించారు.
కాపులకు స్కాలర్షిప్లు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు బుధవారం తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు విద్యార్థుల సంక్షేమం కోసం స్కాలర్షిప్లు మంజూరు చేయాలనుకుంటున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ స్కాలర్షిప్లు మంజూరు చేస్తామన్నారు.