జగన్ కు కేవీపీ లేఖ-పోలవరంపై కీలక సలహా-కేంద్రంపై అలా ఒత్తిడి తెమ్మంటూ...
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు ఎప్పటికల్లా పూర్తవుతుందో చెప్పలేని పరిస్దితికి ప్రభుత్వం కూడా చేరిపోయింది. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్సార్ ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావు ఇవాళ సీఎం జగన్ కు కీలక సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఓ లేఖ రాశారు.
ఏపీ విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించిన కేంద్రం.. కొంతకాలంగా పట్టించుకోవడం మానేసిందని, కాంట్రాక్టుల సంగతి తర్వాత పక్క రాష్ట్రాల్ని ఒప్పించడం కూడా మానేసిందని కేవీపీ సీఎం జగన్ కు రాసిన లేఖలో తెలిపారు.
కేంద్రం తీరుతో ఒడిశా,ఛత్తీస్ ఘడ్ దశాబ్దంగా కోర్టుల్లో కేసులు వేస్తుంటే, మూడేళ్లుగా తెలంగాణ కూడా అదే బాట పట్టిందని కేవీపీ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు.. ఆయా రాష్ట్రాలతో అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం మధ్యవర్తిత్వం చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం ఈ నెల 29న ఈ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు.
విభజన చట్టం ప్రకారం పొరుగు రాష్టాల్ని ఒప్పించడంతో పాటు ముంపు లేకుండా కరకట్టల నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే బాధ్యత కూడా కేంద్రానిదే అని కేవీపీ తెలిపారు. దీనిపై ఈ నెల 29న జరిగే భేటీలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జోక్యం చేసుకోవాలని గట్టిగా కోరాలని సీఎం జగన్ కు కేవీపీ సూచించారు. ఈ విషయంలో సత్వరం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు సీఎం జగన్ కు రాసిన లేఖలో కేవీపీ పేర్కొన్నారు.